తెలంగాణ

telangana

ETV Bharat / state

మొక్కలు నాటారు.. వనంలా మార్చారు!

హరితహారంలో నాటిన మొక్కలు పోలీసు అధికారులు క్రమం తప్పకుండా వాటి బాగోగులు పట్టించుకోవడం వల్ల ఆ ప్రాంతం వనంగా మారింది. కరీంనగర్​ పోలీసులు చూపిన మొక్కవోని దీక్షకు ఫలితంగా జిల్లాకేంద్రంలో ఓ చిట్టడవి తయారైంది. అటవీ విస్తీర్ణం తక్కువగా ఉన్న కరీంనగర్​లో చిట్టడవి సృష్టించి రాష్ట్ర స్థాయి అధికారుల మన్ననలు అందుకున్నారు కరీంనగర్​ పోలీసులు.

By

Published : Jun 8, 2020, 2:49 PM IST

Karim Nagar Police Made Miyavaki Forest
మొక్కలు నాటారు.. వనంలా మార్చారు!

హరితహారంలో పోలీసుల మొక్కవోని దీక్షకు ప్రతిఫలంగా కరీంనగర్‌లో మియావాకి చిట్టడివి తయారైంది. శాంతిభద్రతల పరిరక్షణ మాత్రమే కాదు. చెట్ల పెంపకంలోను పట్టుదలతో కరీంనగర్​ పోలీసులు ముందుకు సాగిన తీరు పలువురిని ఆకర్షిస్తోంది. అటవీ విస్తీర్ణం తక్కువగా ఉన్న కరీంనగర్‌ జిల్లాలో చిట్టడవుల పెంపకానికి ఊతమివ్వాలనే పోలీసుల ప్రయత్నం సత్ఫలితాలనిస్తోంది. రాష్ట్రస్థాయి అధికారుల మన్ననలు అందుకుంటోంది.

చిట్టడువుల జిల్లాగా మార్చేందుకు..

మొక్కల్ని పెంచడమంటే సాదాసీదాగా నాటి.. వదిలేస్తారు. కానీ.. కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు అలా చేయలేదు. నాటిన మొక్కల పట్ల ప్రత్యేక చొరవ చూపారు. మొక్కలు పెంచడంలో విదేశీ పరిజ్ఞానాన్ని ఆచరించారు. పర్యావరణహితుడిగా పేరొందిన జపాన్ శాస్త్రవేత్త అకీరా మియావాకి చెప్పిన విధానాల్ని పాటించారు. తొలుత బీసీ సంక్షేమశాఖమంత్రి గంగుల కమలాకర్‌, మేయర్‌ సునీల్‌రావుతో పాటు వివిధ పాఠశాలల విద్యార్దులతో మొక్కలు నాటించారు. ఆ తర్వాత తీసుకున్న చర్యలో భాగంగా కరీంనగర్‌లో అనతికాలంలోనే సరికొత్త చిట్టడవిని సృష్టించారు. చిట్టడవుల ప్రాధాన్యతను భావితరాలు గుర్తించాలనే ఆలోచనతో కరీంనగర్‌ పోలీసులు మియావాకీ విధానాన్ని ఎంచుకున్నట్టు తెలిపారు.

ఆధునిక విధానంలో మొక్కల పెంపకం

పట్టణంలోని సిటీ పోలీస్‌ శిక్షణా కేంద్రంలో ఉన్న ఎకరం స్థలంలో గతేడాది హరితహారంలో భాగంగా 12 వేల మొక్కల్ని నాటారు. జపాన్‌ వృక్ష శాస్త్రవేత్త అకీరా మియావాకి దశాబ్దాల కిందట చిట్టడువులను పెంచడానికి రూపొందించిన విధానాన్ని అమలు చేసి.. పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. అటవీశాఖ సహకారంతో 12 వేల మొక్కల్ని నాటి.. ఏడాది కాలంలోనే ఏపుగా పెరిగేలా చర్యలు తీసుకున్నారు. ప్రతీ ఏడాది జిల్లాలో ఆయా శాఖలు హరితహారం కార్యక్రమంలో పాల్గొనడం, పోలీసుశాఖ తరపున వీలైనన్ని ఎక్కువ మొక్కల్ని నాటి, పెంచాలనే సంకల్పంతో గతేడాది అన్ని ఠాణాల్లో విరివిగా మొక్కలు నాటించారు. అంతేకాదు.. నాటిన మొక్కల్ని జాగ్రత్తగా ఎదిగేలా చర్యలు తీసుకున్నారు.

సత్ఫలితాలిచ్చిన మియావాకీ విధానం

కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ను హరితహారంలో ప్రత్యేకంగా నిలవాలనే ఆశయంతో కార్యాలయ‌ ఆవరణతో పాటు పోలీసు శిక్షణ కేంద్రంలో ఈ తరహా ప్రయోగాలకు సీపీ కమలాసన్​ రెడ్డి శ్రీకారం చుట్టారు. మియావాకీ విధానం ప్రకారం మొక్కల మధ్య ఎడం, పెంచే విధానంలో ఆధునాతన పద్ధతులు పాటించారు.. ఎండ తగిలేలా మొక్క మొక్కకు మధ్య భిన్నమైన ఎత్తులో ఉండేవాటిని ఎంచుకుని ప్రయోగాత్మకంగా నాటారు. ఉన్న మట్టిని తవ్వి.. కొత్తమట్టిని వేయడం, సూక్ష్మసేద్యం నీటితడుల విధానాలు సహా ఇతరత్రా పర్యవేక్షణలతో ప్రత్యేక శ్రద్ధను చూపి మియవాకి వనాన్ని తయారు చేసినట్లు సీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు.

మరిన్ని మొక్కలు నాటేలా..

కరీంనగర్‌ పోలీస్ కమీషనరేట్ పరిధిలో మొక్కలు చూసి ఇటీవలే ముఖ్యమంత్రి కార్యాలయం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్‌ ట్విటర్‌లో కరీంనగర్‌ పోలీసుల కృషిని, మియావాకీ విధానాన్ని ప్రశంసించారు. ఇదే తరహాలో అటవీశాఖ అధికారులు కరీంనగర్​ పోలీసుల మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. దీన్ని స్పూర్తిగా తీసుకొని రాబోయే కాలంలో మరిన్ని మొక్కలు నాటి.. సంరక్షించే దిశగా చర్యలు తీసుకుంటామని సీపీ చెప్పారు. హరితహారానికి మంచి స్పందన రావడం, పోలీసుల ఆధ్వర్యంలో మొక్కలు నాటి పెంచడానికి పలువురు ముందుకు వస్తుండటం వల్ల ఈసారి హరితహారంలో మరిన్ని ప్రయోగాత్మక చర్యలు చేపట్టి మొక్కల సంఖ్య పెంచుతాం అంటున్నారు కరీంనగర్​ పోలీసులు.

ఇదీ చదవండి:దొంగకు కరోనా ఉంటే.. వణికిపోతున్న పోలీసులు.!

ABOUT THE AUTHOR

...view details