తెలంగాణ

telangana

ETV Bharat / state

Farmers on Paddy Cultivation: పొలాల్లో నీళ్లూరుతుంటే.. వరి వేయొద్దంటే ఎలా?

భూగర్భజలాలు ఉబికి వస్తుంటే వరిపంట వేయవద్దంటూ ప్రభుత్వం ప్రకటించడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కాళేశ్వర జలాలకు తోడు పుష్కలంగా వర్షాలు కురవడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బావుల్లో నీరు పుష్కలంగా కనిపిస్తోంది. గతంలో కరెంట్​, నీటి కొరత ఉన్నప్పుడే వరి పంట వేసేవాళ్లమని.. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని వాపోతున్నారు. మోటార్లు పెట్టక పోయినా పొలాల్లో ప్రవహిస్తున్న నీటిని వినియోగించుకోకుండా ఏ పంట వేయగలుగుతామో ప్రభుత్వమే సమాధానం చెప్పాలంటున్నారు. నీరు పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో వరిపంట వేసుకోవడానికి అనుమతించాలని కోరుతున్నారు.

By

Published : Dec 9, 2021, 3:19 PM IST

Updated : Dec 9, 2021, 3:29 PM IST

paddy
Farmers on Paddy Cultivation: పొలాల్లో నీళ్లూరుతుంటే.. వరి వేయొద్దంటే ఎలా?

గతేడాదితో పోలిస్తే పెద్దపల్లి జిల్లా మినహా కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో నీటి మట్టం గణనీయంగా పెరిగింది. దీనితో నీరు అందుబాటులో ఉన్నా వరి పంట వేయవద్దంటే ఏమి చేయాలో అర్ధం కావడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. జగిత్యాల జిల్లా బీర్పూర్‌ మండలంలోని పలు గ్రామాల్లో బావుల్లో నీరు చేతితో ముంచుకొనే విధంగా నీటి మట్టం పెరిగింది. గతంలో ఐదారు మీటర్ల లోతులో నీరు కాస్తా ఇప్పుడు చేతికి అంది వచ్చింది. అటు బావుల్లోనే కాకుండా పొలాలు సైతం నీటి కారణంగా బురదమయంగానే ఉన్నాయి. నీరు అందుబాటులో లేనప్పుడు ఆరుతడి పంటలు వేసుకున్నా కొంత బాగుంటుంది కాని ఇప్పుడు ఆరుతడి పంటలు ఎలా వేయాలో అర్ధం కాని పరిస్థితి నెలకొందని అంటున్నారు.

పొలాల్లోనే ఊరుతున్న నీరు

ఇతర పంటలు ఎలా వేయగలం?

ప్రస్తుతం వరి పంట కోత దశలో ఉన్నా నీళ్లతో బురదమయంగా ఉండటంతో యంత్రాలు కోతలు చేపట్టలేని స్థితిలో ఉన్నాయని.. అందువల్లనే కూలీలతో పంటలు కోయిస్తున్నామంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో వరి పంటకు బదులు ఇతర పంటలు ఎలా వేయగలమని ప్రశ్నిస్తున్నారు. పొలాలు, బావుల్లో నీరు తగ్గలేదని... ఇప్పుడు ఏ పంట వేయలేని పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నువ్వులు, ఆముదాలు, పొద్దుతిరుగుడు ఏ పంట కూడా ఈ పొలాల్లో వేయలేమని వాపోతున్నారు. వరి పంట వేయవద్దని సూచిస్తున్న సర్కార్‌.. ప్రత్యామ్నాయం చూపెట్టక పోతే మాత్రం ఉరి పెట్టుకొనే పరిస్థితి ఉంటుందని రైతులు హెచ్చరిస్తున్నారు.

కూలీలతో పంటలు కోయిస్తున్న రైతులు

రైతులు ఉరిపెట్టుకోవాల్నా?

మాకు వర్షాకాలం నీరు ఇవ్వకున్నా వానలతోనే వరి పండించినం. బావులు పూర్తిగా నిండి ఉన్నాయి. పొలాల్లో కూడా నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు ఏ పంట వేయరాకుండా ఉంది. నువ్వులు, ఆముదాలు, పొద్దుతిరుగుడు వేయరాదు. ఏ పంట పెట్టినా అది పండదు. మరి ఏ పంట పెట్టాలో ప్రభుత్వం చెప్పి తీరాలి. పొలాలను బీళ్లుగా వదిలేయాలా?. చెరువులు, కుంటలు కట్టించి పంటలు పండించుకోమన్నారు. ఇప్పుడేమో మరి వరి వద్దంటున్నారు. మా పరిస్థితి ఏంది, మా పిల్లల పరిస్థితి ఏంది?. రైతులు ఉరిపెట్టుకోవాల్నా. -ఎల్కోజి చినమల్లయ్య, రైతు, బీర్పూరు, జగిత్యాల జిల్లా

ఏ పంట వేయాలి?

వరిపంట కోసి వడ్లు అమ్మడానికి కేంద్రాల్లో పోసినం. మరి ఇప్పుడు ఏ పంట వేయాలో అర్థం కావడం లేదు. భూగర్భజలాలు పెరిగి పొలాల్లో నీళ్లు ఊరుతున్నాయి. మరి ఈ పొలాల్లో ఏ పంట వేయాలో చెప్పాలి. ఇంతవరకైతే మేం ఎప్పుడైనా పొలాలే వేసినం. ఇప్పుడు ఏం వేయాలో అర్థం కావట్లేదు. -సూద రమేశ్‌, రైతు, జగిత్యాల జిల్లా

వరి పంట తప్ప మరో పంట వేయలేని పరిస్థితి

చెరువులు, కుంటలు తవ్వకాలు చేసింది పంటలు పండించుకోవడానికేనన్న కర్షకులు.. ఇప్పుడు వద్దంటే పొలాలను బీళ్లుగా వదిలేయడం తప్ప మరో మార్గం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం వ్యవసాయం మీద ఆధార పడ్డ తాము ఈసారి పంట వేయకపోతే తమ పరిస్థితి ఏంటని.. పిల్లల పరిస్థితి ఏంటో ప్రభుత్వమే చెప్పాలంటున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడు వర్షాలు బాగా కురిశాయి. అందువల్ల భూగర్భజలాలు పుష్కలంగా పెరిగాయి. వానాకాలం పండించిన పంట చాలావరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉంది. ఇంకా చాలా చోట్ల పొలాలు పచ్చిగా ఉండటంతో కొన్నిచోట్ల కోతలు కూడా మొదలు పెట్టలేదు. మరోవైపు బావుల్లో ఈసారి నీళ్లు బాగున్నాయి కాబట్టి ఈసారి కూడా వరిపంట తప్ప మరో పంట వేయలేమని తేల్చి చెబుతున్నారు.

నీటితో నిండుగా ఉన్న బావి

ఏం చేయలేని పరిస్థితి

వానాకాలం, యాసంగిలో ఎప్పుడైనా మేం వరి పంటే వేసేవాళ్లం. ఇప్పుడేమో వరి పంట వేయెద్దంటున్నారు. వర్షాలు లేనప్పుడు కూడా వరి పండించినం. ఇప్పుడు పుష్కలంగా నీరున్నా ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. వరి పంట వేస్తేనే కాస్త లాభం ఉంటుంది. వేరే ఏ పంట వేసినా నష్టాలే వస్తాయి. -పానుగంటి నర్సయ్య, రైతు, బీర్పూరు,జగిత్యాల జిల్లా

పత్తి చేనులో కూడా నీరే..

ఇతర పంటలు వేస్తే పెట్టుబడి కూడా మిగలదు

మొదటి నుంచి వరి పంటనే వేస్తున్నామన్న అన్నదాతలు.. కందులు, పెసర్లు ఏ పంట వేసినా ఇప్పడు పంట పురుగు తినేస్తుందని అంటున్నారు. ఇతర పంటలు వేస్తే కనీసం పెట్టుబడి కూడా మిగలదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టమైనా, నష్టమైనా వరి పంటకే అలవాటు పడ్డామని రైతులు అంటున్నారు. ఇప్పుడు చేతితో ముంచుకొనే విధంగా బావిలో నుంచి నీళ్లు పైకి ఉబికి వస్తుంటే ఏమి చేయాలో తెలియక రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

ఇదీ చదవండి:

Last Updated : Dec 9, 2021, 3:29 PM IST

ABOUT THE AUTHOR

...view details