తెలంగాణ

telangana

మంత్రి ప్రారంభించి 5 రోజులవుతున్నా.. ప్రారంభం కాని కొనుగోళ్లు

By

Published : Nov 9, 2021, 12:11 PM IST

ప్రభుత్వం వానాకాలం పంట కొనుగోలుకు సిద్ధపడినప్పటికీ.. అధికారుల తీరు రైతులను ముప్పుతిప్పలు పెడుతోంది. ఒకవైపు వానాకాలం పంట ఎప్పుడు కొనుగోలు చేస్తారా అని బెంగపెట్టుకున్న రైతులు.. యాసంగిలో వరి తప్ప వేరే పంట వేసుకోలేని పరిస్థితి ఉంటుందని వాపోతున్నారు. మంత్రే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా.. కొనుగోలు మాత్రం జరగకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

purchases-in-Karimnagar
ధాన్యం కొనుగోలు

కరీంనగర్ జిల్లాలో పౌరసరఫరాల శాఖమంత్రి చొరవ చూపి ప్రారంభించిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో.. 4 రోజులు గడిచినా కొనుగోలు ప్రారంభం కాలేదు. దీంతో రైతుల్లో తీవ్ర ఆవేదన వ్యక్తం అవుతోంది. అటు ధాన్యానికి మద్దతు ధర అందేలా చర్యలు తీసుకుంటామని.. అధికారులు పదే పదే చెబుతున్నా.. ఆచరణలో అది సాధ్యం కావడం లేదు. తక్కువ ధరకు కొంటున్న మిల్లుపై కేసు నమోదు చేశామని తొలుత చెప్పినా.. ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. రోజుల కొద్ది కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం రాశులు పోసినప్పటికి.. అధికారులు కొనుగోలు ప్రక్రియ ప్రారంభించలేదని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

కొనుగోలు ప్రారంభం కానీ..

రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలం పంట కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోంది. 6,540 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు .. ఇప్పటికే పౌరసరఫరాల శాఖమంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. రైతులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు.. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని మంత్రి తెలిపారు. ఈనెల 5న కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల కొనుగోలు కేంద్రాలను ప్రాంభించడమే కాకుండా యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు మొదలు పెట్టాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీచేశారు. దీంతో గత పక్షం రోజులుగా ధాన్యం కొనుగోలుకు ఎదురుచూస్తున్న రైతుల్లో... ఆనందం వ్యక్తం అయ్యింది. అధికారులు ప్రజాప్రతినిధుల ముందు ధాన్యం కొనుగోలు ప్రారంభించినా... ఆ తర్వాత ప్రక్రియ మాత్రం ప్రారంభం కాలేదు. ప్రారంభోత్సవం నాడు కనిపించిన అధికారులు.. ఆ తర్వాత కనిపించకుండా పోయారని రైతులు వాపోతున్నారు.

సాగునీటితో బురదమయం

ఒక వైపు వానాకాలం పంట కొనుగోలు చేయడం లేదన్న బెంగతో పాటు.. యాసంగిలో ధాన్యం వేయక పోతే మరేమి పండించాలో అర్ధం కావడం లేదని ధాన్యం విక్రయానికి వచ్చిన రైతులు వాపోతున్నారు. కాళేశ్వరం జలాలు రాక ముందు సాగునీటి కోసం ఎంతో ఇబ్బంది పడ్డామని గుర్తు చేసుకున్న రైతులు.. ఇప్పుడు సాగునీటితో భూములన్నీ బురదగా మారాయని ఈసారి కోతలు యంత్రాల ద్వారా చేపట్టడంతో పొలాలన్నీ బురదమయంగానే ఉన్నాయని చెబుతున్నారు. ఈ దశలో తాము ధాన్యం తప్ప వేరే పంట వేయలేని పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తమ ధాన్యం అమ్ముకోవడానికి వచ్చి 15 రోజులు దాటిందంటున్న రైతులు… చలి మంచు వల్ల ధాన్యం పగలు ఎండుతూ.. తెల్లారేసరికి తేమలో కూరుకుపోతున్నాయని వాపోతున్నారు. ప్రభుత్వం వేగంగా ధాన్యం కొనుగోలు చేస్తే తప్ప.. తమ సమస్యలు పరిష్కారం అయ్యే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు.

ఇప్పటికే ప్రభుత్వం ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం చలితో పాటు మంచు కురుస్తుండటంతో.. ఆయా ధాన్యం కుప్పల వద్ద కాపలా కాయడం ఇబ్బందిగా మారిందని అన్నదాతలు వాపోతున్నారు.

ABOUT THE AUTHOR

...view details