కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మొదలుపెట్టిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రజా దీవెన యాత్ర తొలిరోజు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బత్తినివానిపల్లి నుంచి ప్రారంభమైన యాత్రలో అడుగడుగునా ఇరుగు పొరుగు నియోజకవర్గాల నుంచి అధికార పార్టీ నాయకులు వచ్చి ఎలాంటి ప్రలోభాలకు గురిచేస్తున్నారో వివరించే ప్రయత్నం చేశారు. శనిగరం, మాదన్నపేట, గునిపర్తి, అంబాల గ్రామాల వరకు పాదయాత్ర కొనసాగింది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టబోతోన్న దళిత బంధు పథకంపై విమర్శలు గుప్పించారు. తన రాజీనామా వల్లే దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న హామీతో పాటు దళితులకు మూడెకరాల భూమి హామీనీ కేసీఆర్ అమలు చేయలేదని విమర్శించారు. ఇప్పుడు ఓట్లను కొల్లగొట్టడానికి ఈ కొత్త పథకం తీసుకొస్తున్నారని అన్నారు. ఎన్నికలకు ముందు ఎలాంటి హామీలు ఇస్తారో.. ఎన్నికల తర్వాత ఎలా మర్చిపోతారో ప్రజలు గమనించాలని కోరారు.
ఎండనక, వాననక పాదయాత్రను కొనసాగిస్తున్న ఈటల ప్రజలతో కలిసే భోజనం చేస్తున్నారు. సోమవారం రాత్రి అంబాలలో బస చేసిన ఈటల.. ఇవాళ గూడూరు, నేరెళ్ల, లక్ష్మీపూర్, కాశింపల్లి, పగిడిపల్లి మీదుగా పాదయాత్రను కొనసాగించనున్నారు. రాత్రికి వంగపల్లిలో బస చేయనున్నారు.
ఈటల రాజేందర్ వెంట హుజురాబాద్ నియోజకవర్గ ఎన్నికల ఇంఛార్జీ, మాజీ ఎంపీ జితేందర్రెడ్డి, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే రఘునందన్రావు, ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బొడిగ శోభ, ప్రేమేందర్ రెడ్డి, యెండల లక్ష్మి నారాయణ, ధర్మారావు, శ్రీశైలం గౌడ్, చాడ సురేష్ రెడ్డి తదితరులు ఉన్నారు.