Bandi Sanjay response to Karnataka election results : కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఓటుబ్యాంక్ చెక్కుచెదరలేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మతతత్వ రాజకీయాలు చేసి అన్ని పార్టీలు ఏకమై.. అధికారం చేజిక్కించుకున్నాయని దుయ్యబట్టారు. ఏ రాష్ట్రంలో ఎన్నికల్లోనైనా అక్కడి స్థానిక పరిస్థితుల ప్రభావం ఉంటుందని.. ఒక రాష్ట్రంలో వచ్చిన ఫలితాల ప్రభావం మరో రాష్ట్రంపై ఉంటుందనుకోవడం సరికాదని తెలిపారు.
గత ఎన్నికల్లో 36 శాతం ఓటింగ్ పర్సంటేజ్తో 104 సీట్లు వస్తే.. ఇప్పుడు జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి ఓటింగ్ శాతం తగ్గకుండా 36 శాతం ఓట్లు పోలయ్యాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ పర్సంటేజీ 38 నుంచి 43 శాతానికి పెరిగిందని.. జేడీఎస్ ఓటింగ్ షేర్ 20శాతం నుంచి 13 శాతంకు తగ్గిందని తెలిపారు.
జేడీఎస్ పార్టీ అధ్యక్షుడు ఇబ్రహీం నేరుగా కాంగ్రెస్కు ఓటేయ్యలని ప్రజలకు పిలుపునిచ్చాడని.. ఎన్డీపీఐ, ఎంఐఎం పార్టీలు కూడా కాంగ్రెస్కు సపోర్ట్ చేశాయన్నారు. అన్ని పార్టీలు కలిసి మతతత్వ రాజకీయం చేసి బీజేపీని ఎదుర్కొన్నాయన్నారు. ఒక వర్గం ఓట్లతో అధికారం హస్తగతం చేసుకున్నాయన్నారు. భజరంగ్దళ్ను నిషేధిస్తామంటూ.. మతతత్వ రాజకీయాలు చేసింది కాంగ్రెస్ పార్టేనని ధ్వజమెత్తారు.