తెలంగాణ

telangana

ఏఐసీటీఈ కోసం ప్రత్యేక పోర్టల్.. జాతీయ స్థాయిలో సత్తా చాటిన కిట్స్​ స్టూడెంట్స్..

By

Published : Nov 25, 2022, 3:30 PM IST

AICTE Educational Portal: వారంతా ఇంజినీరింగ్‌ విద్యార్థులు.. కానీ తరగతి గదుల పాఠాలకే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో సత్తా చాటారు. విద్యార్థుల కృషికి అధ్యాపకుల ప్రోత్సాహం తోడవడంతో కేంద్ర ప్రభుత్వ అవార్డుతో పాటు లక్ష రూపాయల నగదు బహుమతినీ అందుకొని శభాష్‌ అనిపించుకున్నారు. స్మార్ట్‌ ఇండియా హ్యకథాన్‌-2022లో భాగంగా విద్యావ్యవస్థకు సంబంధించిన వివరాల సేకరణ కోసం ప్రత్యేక పోర్టల్‌ను రూపొందించారు ఈ విద్యార్థులు. దేశ వ్యాప్తంగా 33 బృందాలు పాల్గొన్న పోటీల్లో ప్రతిభ కనబరిచిన కిట్స్‌ కళాశాల విద్యార్థులు తోటివారికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

students of Kamala Institute of Technology and Science
students of Kamala Institute of Technology and Science

జాతీయ స్థాయిలో సత్తా చాటిన కిట్స్​ కాలేజీ విద్యార్థులు.. AICTE ప్రత్యేక పోర్టల్​ తయారీ

AICTE Educational Portal: ఇంజినీరింగ్‌ విద్యనభ్యసించే విద్యార్థులు సాఫ్ట్‌వేర్‌ కొలువే లక్ష్యంగా సాగిపోతుంటారు. కొందరేమో తమ చదువు సమాజానికి ఎంతమేరకు తోడ్పడుతుందనే ఆలోచనతో ఆవిష్కరణల వైపు మళ్లుతుంటారు. రెండో కోవకు చెందిన వారే ఈ విద్యార్థులు. హ్యాకథాన్‌-2022లో పాఠశాల స్థాయి నుంచి ఉద్యోగాల వరకు ఉన్న విద్యార్థుల వివరాలు, మధ్యలోనే చదువు మానేసిన వారి వివరాలు తెలుసుకునేలా ఓ పోర్టల్‌ను రూపొందించారు.

కంప్యూటర్లతో కుస్తీ పడుతున్న ఈ ఆరుగురు విద్యార్థులు.. కరీంనగర్‌ జిల్లా సింగాపూర్‌ లోని కమలా ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్ సైన్స్‌-కిట్స్‌ కళాశాలలో ఇంజినీరింగ్‌ విద్యార్థులు. సీఎస్​ఈ విభాగంలో తృతీయ, చివరి సంవత్సరం చదువుతున్న సబా ఆఫ్రిన్‌, కౌశిక్‌, అనుదీప్‌రెడ్డి, మధుమిత, నౌరీన్‌ తబస్సుం, సొఫియా తరన్నుంలు ఓ బృందంగా స్మార్ట్‌ ఇండియా హ్యకథాన్‌-2022లో పాల్గొని అందులో విలువైన సమాచారం అందించడానికి కృషి చేశారు.

దేశ వ్యాప్తంగా స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌లో కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అందులో ఈ బృందం విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు విద్యార్థులు ఎక్కడెక్కడ చదువుతున్నారు.. ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు.? చదువుకుంటున్నారా.?మధ్యలో మానేసారా.? వారి ఉపాధ్యాయులు ఎవరు.? అనే పోర్టల్‌ను రూపకల్పన చేశారు.

ఆధునిక సాంకేతిక భాషలు ఉపయోగించి ఏఐసీటీఈ ఎడ్యుకేషనల్‌ పోర్టల్ అప్లికేషన్‌ తయారు చేసి పంపించారు విద్యార్థులు. దేశ వ్యాప్తంగా ఆయా కళాశాలల యాజమాన్యం.. విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలను ఏఐసీటీఈ పోర్టల్‌ నుంచి తీసుకునేలా రూపొందించారు. కొత్త విద్యార్థుల విషయంలో పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపల్‌ పోర్టల్‌ నుంచి ఆధార్‌ నెంబర్‌తో సహా ఇతర సమాచారం తీసుకునేలా తీర్చిదిద్దారు.

పోర్టల్‌ నుంచి తీసుకున్న సమాచారాన్ని 'మై SQL" సర్వర్‌లో భద్రపరిచేలా తయారు చేశారు. ఎవరైతే ఈ అప్లికేషన్‌ వాడుతున్నారో వాళ్లకి అదే సర్వర్‌ నుంచి సమాచారం ఇస్తున్నారు. ఈ అప్లికేషన్‌ వాడేది పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపల్‌ స్థాయి వ్యక్తులే కాబట్టి తప్పుడు సమాచారం ఇవ్వడానికి ఆస్కారం లేకుండా చేశారు. దీంతో మధ్యలో చదువును మానేసిన విద్యార్థుల గురించి తెలుసుకోవడం సునాయాసంగా ఉంటుందని అంటున్నారు.

ఏఐసీటీఈ ఎడ్యుకేషనల్‌ పోర్టల్‌ పరిశీలించిన నిపుణులు జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఒడిశాలోని జీఐఈటీ విశ్వవిద్యాలయంలో జరిగిన పోటీల్లో 33 బృందాలు పాల్గొనగా కిట్స్‌ బృందం విజేతగా నిలిచి లక్ష రూపాయల నగదు బహూమతి అందుకుంది. బృందంలోని కౌశిక్‌ అనే విద్యార్థి యునెస్కో ఇండియా-ఆఫ్రికా దేశాల సమన్వయంతో నిర్వహించే అంతర్జాతీయ హ్యాకథాన్‌ పోటీలకు ఎంపికయ్యాడు.
విద్యార్థుల ఈ విజయం కళాశాలకు పేరు ప్రఖ్యాతలను పెంచిందని అధ్యాపకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పోటీల వల్ల విద్యార్థుల్లో కొత్త ఉత్సాహంతో పాటు పోటీ తత్వం అలవడుతుందని అధ్యాపకులతో పాటు విద్యార్థులు తోటి విద్యార్థులకు సూచిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details