Women Slapped Rice merchant: బియ్యం వ్యాపారిని ఓ మహిళ చెప్పుతో కొట్టిన ఘటన కామారెడ్డిలో చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన ఓ బియ్యం వ్యాపారికి మాచారెడ్డి మండలం భవానిపేట్ తండాకు చెందిన మోహన్, సాయిలు అనే రైతులు.. తమ పంట బియ్యాన్ని సరఫరా చేశారు. ఆ బియ్యానికి సంబంధించిన డబ్బులు.. సుమారు 50 వేల రూపాయలు రైతులకు ఆ వ్యాపారి ఇవ్వాల్సి ఉంది.
డబ్బులు ఇవ్వమని అడిగినప్పుడల్లా.. ఇప్పుడిస్తా.. అప్పుడిస్తా.. అంటూ దాటవేస్తున్నాడు. గురువారం(జనవరి 27) మధ్యాహ్నం సమయంలో మోహన్ కుటుంబసభ్యులు.. సిరిసిల్లా రోడ్డులోని దుకాణం దగ్గరకు వచ్చారు. డబ్బులు ఇవ్వాలని వ్యాపారిని అడిగారు. ఈ క్రమంలో వ్యాపారికి మోహన్ కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మాటామాటా పెరగటంతో.. ఓ మహిళ వ్యాపారిని చెప్పుతో కొట్టింది. మరో మహిళ వ్యాపారిపై చేయిచేసుకుంది. అక్కడే ఉన్న స్థానికులు మహిళలను ఆపి సముదాయించారు.