కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వివిధ వార్డుల్లో తడి, పొడి చెత్త సేకరణకు పంపిణీ చేసిన బుట్టలను ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు. పాలిథిన్ సంచులు, ఇతర వ్యర్థాలు కనిపించినా వెంటనే బుట్టలో వేస్తున్నారు. పురపాలిక ఆటోలు ఇళ్ల ముందుకు రాగానే జనం ఇంటి గడపదాటి చెత్తను అందిస్తున్నారు. సేకరించిన వ్యర్థాలను డంపింగ్యార్డులో వేరు చేసి కంపోస్ట్ ఎరువు తయారీకి సిబ్బంది చర్యలు చేపడుతున్నారు.
విస్తృత ప్రచారంతోనే
ఆయా వార్డుల్లో పురపాలిక తరపున విస్తృత ప్రచారంతోనే మార్పు కనిపిస్తోంది. జనాలు, వ్యాపారులు కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించినా ..అధికారుల ఆకస్మిక తనిఖీల్లో ఎక్కడైనా చెత్త కనిపిస్తే కఠిన చర్యలు చేపడుతున్నారు. సుభాష్రోడ్డు, డెయిలీమార్కెట్, జేపీఎన్ రోడ్డు, నిజాంసాగర్ రోడ్డు, అశోక్నగర్ రోడ్డు ప్రాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రధాన వాణిజ్య ప్రాంతాలన్నీ ఇక్కడే ఏర్పాటయ్యాయి. దీంతో డబ్బాలు, ఇతర వ్యర్థాలను సేకరించి పురపాలిక సిబ్బందికి అందజేస్తున్నారు.
కాల్వల్లో పేరుకుపోకుండా చర్యలు
పాలిథిన్ సంచులు, చెత్తా చెదారంతో కాల్వలో నీరు పారేందుకు వీలయ్యేది కాదు. ఎక్కడి వారక్కడ ఇంటి ఆవరణలో, దుకాణాల ఎదుట కాల్వలో చెత్తను పారేయడంతో సమస్య ఉత్పన్నమైంది. వానాకాలంలో వ్యర్థాలు పేరుకుపోయి వరద నీరు సునాయసంగా పారేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రస్తుతం నిత్యం ఇంటి చెంతకే పురపాలక సిబ్బంది వచ్చి చెత్తను తీసుకెళ్తున్నారు.