కామారెడ్డి జిల్లా కేంద్రంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ శరత్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఓపెన్ టాప్ జీపులో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాలో ఉత్తమ సేవలందించిన అధికారులకు కలెక్టర్ ప్రశంసా పత్రాలను అందజేశారు.
అగ్రస్థానంలో జిల్లా
నూతన జిల్లాగా ఏర్పాటైన కామారెడ్డిలో అభివృద్ధి వేగంగా సాగుతోందని కలెక్టర్ అన్నారు. ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేయడంలో జిల్లా యంత్రాంగం నిరంతరంగా కృషి చేస్తోందని కొనియాడారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ జిల్లాను అగ్రస్థానంలో నిలిపామని పేర్కొన్నారు. అందులో భాగంగా రాష్ట్రపతి చేతుల మీదుగా డిజిటల్ ఇండియా అవార్డు అందుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.