తెలంగాణ

telangana

ETV Bharat / state

మూన్నాళ్ల ముచ్చటగానే తుమ్మిళ్ల ఎత్తిపోతల.. మరమ్మతుల ఊసేత్తని సర్కార్​ - RDS CANALS

ఒక్క మోటార్​తో నీళ్లు ఎత్తిపోస్తేనే తట్టుకోలేని కాలువలు... బలహీనమైన కరకట్టలు.. షట్టర్లు లేని తూములు.. అస్తవ్యస్తంగా డిస్టిబ్యూటరీలు.. ఇది సంక్తిప్తంగా తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం దుస్థితి. వీటన్నీంటికి మరమ్మతులు చేపడితేనే చివరి ఆయకట్టుకు సాగునీరు అందుతుందని తెలిసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రూ.61 కోట్లతో ప్రతిపాదనలు ముందున్నా.. మంజూరుకు నోచుకోలేదు. రెండో దశలో చేపట్టాల్సిన మూడు జలాశయాల ఊసేలేదు. వెరసి తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంపై రైతుల ఆశలు అడియాశలయ్యాయి. రికార్డు సమయంలో తుమ్మిళ్ల ద్వారా ఆర్టీఎస్​కు నీళ్లు పారించిన సంబరం మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది.

thummilla lift irrigation
మూన్నాళ్ల ముచ్చటగానే తుమ్మిళ్ల ఎత్తిపోతల.. మరమ్మతుల ఊసేత్తని సర్కార్​

By

Published : Jul 9, 2020, 12:16 PM IST

మూన్నాళ్ల ముచ్చటగానే తుమ్మిళ్ల ఎత్తిపోతల.. మరమ్మతుల ఊసేత్తని సర్కార్​

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిచేస్తామన్న సాగునీటి ప్రాజెక్టుల్లో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ఒకటి. రూ.783 కోట్ల అంచనా వ్యయంతో తుమ్మిళ్ల వద్ద తుంగభద్ర నది నుంచి ఆర్డీఎస్ కాల్వలకు నీరు ఎత్తిపోయడం.. రెండో దశలో మూడు జలాశయాల నిర్మాణం ఎత్తిపోతల పథకం ప్రణాళిక. తద్వారా రాజోలి బండ డైవర్షన్ స్కీం చివరి ఆయకట్టు వరకూ 55వేల ఎకరాలకు నీరందించాలన్నది లక్ష్యం.

శిథిలావస్థకు నిర్మాణాలు..

మొదటి దశ పనులు పూర్తయ్యాయి. మూడు మోటార్లు అందుబాటులోకి వచ్చాయి. తుంగభద్ర నదికి వరదలొస్తే నీళ్లు ఎత్తిపోసేందుకు అంతా సిద్ధంగా ఉంది. కానీ చివరి ఆయకట్టుకు నీళ్లందే పరిస్థితి లేదు. 60 ఏళ్ల కిందట నిర్మించిన ఆర్డీఎస్ కాలువలు నేడు శిథిలావస్థకు చేరుకోవడమే కారణం. ఒక్కో మోటారు ద్వారా 330 క్యూసెక్కుల నీటిని పంపు చేయవచ్చు. కానీ ఆ నీటిని మోసేంత సామర్థ్యం ప్రస్తుత ఆర్డీఎస్ కాల్వలకు లేదు. ప్రధాన కాల్వలు సహా 23 నుంచి 40వ డిస్టిబ్యూటరీ శిథిలావస్థకు చేరుకున్నాయి. పంట కాలువలు దారుణంగా దెబ్బతిన్నాయి. ప్రధాన కాలువ పూడిక పేరుకుపోయింది. నీటి కోసం రైతులు కరకట్టల్ని తవ్వేయడంతో కట్టలు బలహీనంగా మారాయి.

పెండింగ్​లో రూ.61 కోట్లు ప్రతిపాదనలు..

తొలిసారిగా తుమ్మిళ్ల ద్వారా నీళ్లు ఎత్తిపోసినప్పుడు ట్రయల్ రన్​లోనే ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రధాన కాల్వలకు పలుచోట్ల గండ్లు పడ్డాయి. మరమ్మతులు, ఆధునికీకరణ కోసం రూ. 61 కోట్ల ప్రతిపాదనలు పంపినా.. ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగా తుంగభద్రలో నీరున్నా.. సాగునీరందించనలేని దుస్థితి తుమ్మిళ్ల పథకానిది. అలంపూర్​ నియోజకవర్గ పరిధిలో ఉపాధి హామీ పథకం కింద ఆర్టీఎస్ కాలువల పూడికతీత, జంగిల్ కంటింగ్ పనులు అక్కడక్కడా చేపట్టారు. కాలువర మరమ్మతులకు ఉపాధిహామీ పనులు ఉపయోగపడ్డాయి. సుమారు రూ. 1.2 కోట్ల విలువైన పనులు చేసినట్లు అంచనా. కొన్ని చోట్ల ప్రధాన కాలువకు, మరికొన్ని చోట్ల పిల్లకాలువల్లో పూడికతీత పనులు చేపట్టారు.

యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటేనే..

తుమ్మిళ్ల రెండో దశలో భాగంగా మూడు జలాశయాలను నిర్మించాల్సి ఉంది. ఇప్పటికీ ఆయా నిర్మాణాల కోసం కనీసం భూసేరణ జరగలేదు. మల్లన్నకుంట, జూలకల్లు, వల్లూరు గ్రామాల్లో నిర్మించాలనుకున్న జలాశయాల సామర్థ్యం కూడా తక్కువే. కనీసం ఆరు టీఎంసీల నీటి నిల్వ ఉండేలా జలాశయాల నిర్మాణం యుద్ధప్రాతిపదికన చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

సాగునీరు అందని ద్రాక్షగానే..

తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా ప్రస్తుతానికి రాజోలి, వడ్డేపల్లి మండలాల్లోని ఆయకట్టుకు మాత్రమే నీరందుతోంది. చివరి ఆయకట్టైన.. మానవపాడు, అలంపూర్, ఉండవల్లి, ఇటిక్యాల మండలాల రైతులకు సాగునీరు అందని ద్రాక్షగానే మిగిలింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కాలువల ఆధునికీకరణ, మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

ఇవీచూడండి:మళ్లీ కొహెడకే గడ్డి అన్నారం పండ్ల మార్కెట్

ABOUT THE AUTHOR

...view details