ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆదివారం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులేమీ నమోదు కాలేదు. జోగులాంబ గద్వాల జిల్లా మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో 15 రోజులకు పైగా కొత్తకేసులు నమోదు కాకపోవడం వల్ల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 45 కరోనా పాజిటివ్ కేసులు ఉండగా.. 10 మంది కోలుకున్నారు. 45 కేసుల్లో గద్వాల 31, అయిజ 6, రాజోలిలో 4, వడ్డేపల్లిలో 2, ఇటిక్యాల, అలంపూర్ మండలాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. 570 నమూనాలు పరీక్షలకు పంపగా ఇప్పటి వరకూ.. 528 మందికి కరోనా లేదని తేలింది. ఒకరి ఫలితం రావాల్సి ఉంది. 1, 244 మంది హోం క్వారంటైన్లో కొనసాగుతున్నారు.
కంటైన్మెంట్ జోన్ల ఎత్తివేత..
ప్రభుత్వ క్వారంటైన్లో ఉన్న వారందరినీ.. హోం క్వారంటైన్కు తరలించారు. పాజిటివ్ కేసులు నమోదైన 14 ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించారు. వీటిలో గద్వాలలో 8 జోన్లు ఉండగా.. అయిజలో 2, రాజోలి, ఇటిక్యాల, అలంపూర్, వడ్డేపల్లి ప్రాంతాల్లో ఒక్కో జోన్ ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లాలో 11 కేసులు నమోదు కాగా 9 మంది డిశ్చార్జయ్యారు. ఇద్దరు గాంధీలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ నమూనాలు పంపిన అన్ని ఫలితాలు నెగటివ్ వచ్చాయి. ఒక్కొక్కటిగా కంటైన్మెంట్ జోన్లను ఎత్తేస్తున్నారు.