తెలంగాణ

telangana

By

Published : Aug 7, 2020, 9:04 PM IST

ETV Bharat / state

గద్వాల జిల్లా అధికారులతో ఆన్​లైన్​ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్​

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి తారక రామారావు గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్, ఇతర జిల్లాస్థాయి అధికారులతో ఆన్​లైన్​ సమావేశంలో పాల్గొన్నారు. గద్వాల జిల్లా చేనేత పార్కును ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో 2020 సంవత్సరానికి గానూ పద్దెనిమిది మంది చేనేత కార్మికులకు కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులను అందించారు.

Ktr Announce For Gadwal Gadwal handloom Park
గద్వాల జిల్లా అధికారులతో ఆన్​లైన్​ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్​

జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్​ కార్యాలయంలో జూమ్​ యాప్​ ద్వారా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జిల్లా​ అధికారులతో మాట్లాడారు. త్వరలో గద్వాల చేనేత పార్కు ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేస్తామన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది 18 మంది నేత కార్మికులకు కొండా లక్ష్మణ్​ బాపూజీ అవార్డులను ప్రదానం చేశారు. కొత్తకోటకు చెందిన కృష్ణయ్య, సిద్దిపేటకు చెందిన గాజుల నారాయణకు మంత్రి చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేయగా.. మిగిలిన 16 మందికి ఆయా జిల్లా కలెక్టర్లు అవార్డులు బహూకరించారు. అవార్డు గ్రహీతలకు మెమోంటో, శాలువ, ప్రశంసాపత్రంతో పాటు 10వేల రూపాయల పారితోషికాన్ని అందజేశారు. 2015లో భారత ప్రభుత్వం ఆగష్టు 7న జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించగా.. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని.. ఈ ఏడాది కొవిడ్-19 కారణంగా జిల్లాల్లోనే అర్హులకు అవార్డులు అందజేసినట్టు మంత్రి తెలిపారు. చేనేత కళాకారుల ఉన్నతికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని గుర్తు చేశారు. నేతన్నకు చేయూత, చేనేత మిత్ర వంటి పథకాలను కొనసాగిస్తామన్నారు. గద్వాల చేనేత పార్కు కోసం ఇప్పటికే శంఖుస్థాపన చేశామని, త్వరలో పనులు ప్రారంభించి గద్వాల చేనేత కార్మికుల కల నెరవేర్చనున్నట్లు మంత్రి ప్రకటించారు.

భారత దేశ వారసత్వ సంపద అయిన చేనేత రంగాన్ని కాపాడుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం మూడు కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకున్నదని మంత్రి తెలిపారు. మొదటిది ఇండియన్​ స్కూల్​ ఆఫ్​ బిజినెస్​తో కొత్త కొత్త డిజైన్లు మార్కెటింగ్ చేసేందుకు ఒప్పందం కుదిరింది. రెండవది చేనేతలో హానికారకమైన రంగులు వాడకుండా పర్యావరణాన్ని కాపాడడం, అవసరమైన రంగులనే వాడటానికి సిఫారసు చేయడానికి ఐఐసీటీతో ఒప్పందం చేసుకున్నట్టు హ్యాండ్లూమ్, ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ అన్నారు. మహిళలను చేనేత రంగంలో ప్రోత్సహించడానికి తీసుకోవాల్సిన చర్యలపై యునెస్కోతో చేసుకున్న ఒప్పందం మూడవది అని ఆయన తెలిపారు.

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా అవార్డులకు జిల్లా నుంచి మూడు నామినేషన్లు వెళ్లగా అందులో గడ్డం అనిత అనే మహిళ నేసిన సిల్క్, లెనిన్ కాటన్​తో నేసిన చీర అవార్డుకు ఎంపికైంది. గద్వాల చీరలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న గుర్తింపును కాపాడుకోడానికి మరింత నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానంతో చీరలు నేయాలని గద్వాల కలెక్టర్​ సూచించారు. ఎప్పటికప్పుడు మార్కెట్లో వస్తున్న ట్రెండ్​ని గమనిస్తూ సరికొత్త డిజైన్లు రూపొందించాలని అన్నారు. నేతన్నకు చేయూత పథకం ద్వారా చేనేత కార్మికుడు ప్రతి నెల 8 శాతం పొదుపును తన రికరింగ్ అకౌంటులో జమ చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం మరో 16 శాతం కలిపి జమచేస్తుందని కలెక్టర్​ తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లాలో దాదాపు 4వేల రికరింగ్ అకౌంట్లు ఉన్నట్లు కలెక్టర్​ వివరించారు.

రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికైన గడ్డం అనితను శాలువ, మెమోంటో, ప్రశంసా పత్రముతో పాటు రూ. 10 వేల చెక్కును అందజేసి సత్కరించారు. జిల్లాలో అధికారులు ప్రతి సోమవారం చేనేత వస్త్రాలను విధిగా ధరించాలని, అలాగే బంధు మిత్రులు, కుటుంబ సభ్యులు సైతం చేనేత వస్త్రాలు ధరించేలా ప్రోత్సహించాలని కలెక్టర్​ అన్నారు. చేనేత కార్మికుల ఆర్థికాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ కమిషనర్ శైలజ రామయ్యర్, గద్వాల నుండి ఏడీ హ్యాండ్లుమ్ చరణ్, మాస్టర్ వీవర్ గోవింద్ రావు, అవార్డు గ్రహిత జీ.అనిత, చేనేత సమితి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ఇవీచూడండి:భారత్ బయోటెక్​ ల్యాబ్​ను సందర్శించిన మంత్రి కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details