తెలంగాణ

telangana

ETV Bharat / state

నిఘా ఉన్నా.. భారీగా బయటపడుతున్న నకిలీ పత్తివిత్తనాలు - జోగులాంబ గద్వాల జిల్లా వార్తలు

టాస్క్​ఫోర్స్​ దాడుల్లో వందల క్వింటాళ్లలో నకిలీ విత్తనాలు పట్టుకుంటున్న వ్యవసాయశాఖ.. వాటి మూలాలపై మాత్రం దృష్టి సారించడం లేదు. పత్తి విత్తనాలను ఉత్పత్తి చేసే కంపెనీలు.. వాటి లెక్కలు వ్యవసాయ శాఖకు ఇవ్వడం లేదు. విత్తన పత్తి సాగుకు కేంద్రమైన జోగులాంబ గద్వాల జిల్లాలో కేవలం రెండే కంపెనీలు వ్యవసాయ శాఖకు వివరాలిచ్చాయి. పూర్తి స్థాయి లెక్కలు తేలితే నకిలీల దందా బండారం బైటపెట్టడం మరింత సులువు అవుతుంది.

fake-cotton-seeds-are-coming-out-heavily-in-jogulamba-district
నిఘా ఉన్నా.. భారీగా బయటపడుతున్న నకిలీ పత్తివిత్తనాలు

By

Published : Jun 27, 2020, 1:37 PM IST

రాష్ట్రంలో విత్తన పత్తి అత్యధికంగా సాగయ్యే జిల్లా జోగులాంబ గద్వాల. గతేడాది 40 వేల ఎకరాల్లో విత్తనపత్తి సాగు చేయగా.. ఈసారి సుమారు 25 వేల ఎకరాల్లో సాగవుతోంది. ఆర్గనైజర్​లు రైతులతో విత్తనపత్తిని సాగు చేయిస్తుంటారు. కానీ ఏ రైతు ఎన్ని ఎకరాల్లో ఉత్పత్తి చేస్తున్నాడు.. ఏ కంపెనీ విత్తులు సాగు చేస్తున్నాడో.. వ్యవసాయ శాఖకు తెలియదు. కంపెనీలు తమ ఉత్పత్తి వివరాలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి ముందే ఇవ్వాలి. కానీ ఇవ్వడం లేదు. పంట పండించాక వాటికి నాణ్యత పరీక్షలు నిర్వహించి.. మేలైన విత్తనాన్ని మాత్రమే మార్కెట్​లో అమ్ముతారు. పరీక్షల్లో విఫలమైన విత్తనాలను తిరిగి వినియోగించకుండా చర్యలు తీసుకుంటే.. నకిలీ విత్తనాలు మార్కెట్​లోకి వచ్చే అవకాశమే ఉండదు. అలా విఫలమైన విత్తులను దళారులు కొనుగోలు చేసి.. రైతులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.

జిల్లాలో సుమారు 14 కంపెనీలు పత్తి విత్తనాలు ఉత్పత్తి చేస్తుండగా.. సమాచారాన్ని కేవలం 2 కంపెనీలు మాత్రమే అందించాయి. ఈ పత్తి సాగు జూన్, జులైలో ప్రారంభమై.. డిసెంబర్ నాటికి ముగుస్తుంది. విత్తనం చేతికొచ్చి నాణ్యత పరీక్షల ఫలితాలు సైతం ఫిబ్రవరి కల్లా వచ్చేస్తాయి. విఫలమైన విత్తనాలను వెంటనే కంపెనీలు ఆర్గనైజర్​లకు, రైతులకు తిరిగి పంపుతాయి.

సమాచారం అందించండి..

నకిలీ విత్తన దందాపై సీఎం ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వ్యవసాయ, పోలీసు సహా ఇతర శాఖలు టాస్క్​ఫోర్స్ బృందాలుగా ఏర్పడి.. విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నాయి. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే సంబంధిత పోలీసు, వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలని ఎస్పీ రంజన్ రతన్ కుమార్ వెల్లడించారు.

నకిలీ విత్తనాలు తిరిగి మార్కెట్​లోకి రావడానికి పరోక్షంగా కారణమవుతున్న కంపెనీల నిర్లక్ష్యంపై ఇప్పటికైనా ప్రభుత్వం కొరడా ఝళిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా చేసినట్లయితే రైతులు నాణ్యమైన విత్తనాలను ఉపయోగించి నష్టాల నుంచి తప్పించుకునే అవకాశం లేకపోలేదు.

ఇవీచూడండి:గ్రేటర్‌లో కరోనా పంజా... మూతబడుతోన్న కార్యాలయాలు

ABOUT THE AUTHOR

...view details