సరైన వసతులు లేక ఇబ్బంది పడుతున్న రోగులు
జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు రక్త శుద్ధి చేసుకుంటున్నారు. ఈ జిల్లా కేంద్రంలో కేవలం 5 శుద్ధి యంత్రాలు మాత్రమే ఉన్నాయని 150 మందికి అవి ఎలా సరిపోతాయని వ్యాధి బాధితులు వాపోతున్నారు. సరిపడా బెడ్లు లేవని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పనిభారం పెరుగుతోంది...
ఈ 5 యంత్రాల్లో 4 మాత్రమే సరిగా పనిచేస్తున్నాయని యాజమాన్యం చెబుతోంది. మరో 5మిషన్లు వస్తాయని చెబుతున్నా... ఇప్పటివరకు అవి రాలేదని తెలిపారు. ఉదయం 5 నుంచి తెల్లవారుజామున 3 గంటలవరకు ఈ కేంద్రం తెరిచే ఉన్నా... యంత్రాలు తక్కువ ఉండడం వల్ల పనిభారం పెరుగుతోందని డయాలసిస్ సూపరింటెండెంట్ తెలిపారు.
పింఛన్ ఇప్పించండి...
ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోని వారు మహబూబ్నగర్, హైదరాబాద్కు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారు. మాత్రలు కొనుక్కోవడం కూడా కష్టమవుతుందని పేర్కొంటున్నారు. డయాలసిస్ రోగులకు పింఛన్ ఇవ్వాలని కోరుతున్నారు. మంచి నీళ్లు, ఫ్యాన్లు, డాక్టర్ల కొరత ఎక్కువగా ఉందని ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో మూత్రపిండాల వ్యాధి గ్రస్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నా... యంత్రాలు అధిక సంఖ్యలో ఉంటే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదని రోగులు, వైద్యులు పేర్కొంటున్నారు. డయాలసిస్ రోగులకు ప్రభుత్వ పింఛన్ అందిస్తే వారికి కొంత వరకు భరోసా ఉంటుంది.