తెలంగాణ

telangana

Vigilance officers investigation in KTPP : కేటీపీపీలో మాయమైన సొత్తుపై విజిలెన్స్ విచారణ

By

Published : Jun 7, 2023, 6:31 PM IST

KTPP Vigilance Officers : కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు కేటీపీపీలోని స్టోర్‌ రూమ్‌లోని విద్యుత్‌ సామగ్రి, రాగి తీగలు, విడి భాగాలు మాయమైన ఘటనపై విజిలెన్స్‌ అధికారులు విచారణ చేపట్టారు. ప్లాంట్‌ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారో తెలుసుకోవడం కోసం జెన్‌కో ఉన్నతస్థాయి విజిలెన్స్‌ బృందాన్ని నియమించింది.

కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు
కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు

Investigation by Vigilance Officers at KTPP : కేటీపీపీలోని స్టోర్ రూమ్​లోని విద్యుత్ సామగ్రి, రాగి తీగలు, విడిభాగాలు మాయమైన ఘటనపై విజిలెన్స్ శాఖ దృష్టి సారించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా, గణపురం మండలం చెల్పూర్ లోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు కేటీపీపీలోని స్టోర్ రూమ్​లో కొంత సామాగ్రి మాయమైన విషయం తెలిసిందే.. వీటి విలువ సుమారు రూ. 80 లక్షలుగా ఉంటుందని జెన్‌కో విజిలెన్స్‌ ఉన్నతస్థాయి అధికారులు గుర్తించారు.

విచారణ కోసం ఉన్నత స్థాయి విజిలెన్స్ బృందాన్ని జెన్​కో పంపించగా.. సంబంధిత అధికారులను విచారించారు. కేేటీపీపీలోని అన్ని సీసీ కెమెరాలను వారు పరిశీలించారు. అంత సెక్యూరిటీ ఉన్న.. సామాగ్రి ఎలా మాయమైందనే విషయంపై కూఫీ లాగుతున్నారు. ఈ తతంగంలో ఆరుగురు ఉద్యోగులు ఉన్నట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. సెక్యూరిటీ అధికారులు అర్ధరాత్రి వేళ ఒక వాహనాన్ని సోదాలు చేయకుండా బయటకు పంపించిన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ రోజు విధుల్లో ఎవరు ఉన్నారోనని అధికారులు అడిగి తెలుసుకునే పనిలో పడ్డారు. ప్రతి ఒక్క వ్యక్తిని తనిఖీ చేసి పంపించే సిబ్బంది.. ఆ ఒక్క వాహనాన్ని ఎందుకు తనిఖీ చేయకుండా బయటకు పంపడంపై ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. అధికారులు ఎవరైనా సహాయం చేసి ఉంటారా అన్న కోణంలో విచారణ రహస్యంగా కొనసాగిస్తున్నట్లు సమాచారం.

Kakatiya Thermal Power Project In Warangal: కేటీపీపీలో సొత్తు మాయమైనా పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది. అయినప్పటికీ సమాచారం తెలుసుకున్న భూపాలపల్లి డీఎస్పీ రాములు, సీఐ వేణుచందర్, ఎస్సై అభినవ్ స్టోర్ రూం వద్దకు వెళ్లి పరిశీలించారు. అక్కడ ఉన్న స్పేర్ పార్ట్‌లు విద్యుత్తు ప్రాజెక్టులకు తప్ప ఇంకోదానికి పనికిరావు. వీటిని ఓ ప్రముఖ దేశీయ కంపెనీ జెన్‌కోకు పంపిణీ చేస్తోందని పోలీసులు పేర్కొన్నారు.

కేటీపీపీలో అసలు ఏం జరుగుతుంది : వెలుగులు విరజిమ్మే కేటీపీపీలో అధికారులు ఆడిందే ఆటలా.. పాడిందే పాటలా సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎలాంటి సంఘటనలు, ఘటనలు జరిగిన మీడియాను లోపలికి అనుమతించకుండా ఏం జరిగినా లోలోపల కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడం పట్ల పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉద్యోగులు కోరుతున్నారు. జెన్​కోలో పని చేసే సిబ్బంది నియామకంలోనూ అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. పైరవీకారుల వద్ద ముడుపులు తీసుకుని కనీసం పదో తరగతి కూడా చదవని వాళ్లను నియామకం చేశారని అర్హులకు మొండిచేయి చూపించారనే విమర్శలు వస్తున్నాయి.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details