జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రైతుల కష్టాలు దుర్భరంగా ఉన్నాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఐకేపీ కేంద్రాల్లో మొక్కజొన్నలు, వరిధాన్యాన్ని పోసి.. వాటి కొనుగోళ్లు జరగక నానా ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఐకేపీ కేంద్రాల్లో రైస్ మిల్లర్ల దోపిడీ జరుగుతోందని.. వాటిపై విచారణ చేపట్టి.. కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర నాయకులు గండ్ర సత్యనారాయణ రావు కలెక్టర్ను కోరారు.
ఇష్టానుసారంగా హమాలీ ఛార్జీలు వసూలు
జిల్లావ్యాప్తంగా చాలాచోట్ల ఇలానే కేంద్రాలు, మిల్లర్ల మధ్య బేరసారాలు జరుగుతున్నాయని... అమాయక రైతులను ముంచుతున్నారని కోరారు. హమాలీ చార్జిలు కూడా తమకిష్టం వచ్చినట్లు పెంచుతున్నారు. సర్కారు ఇలాంటి వారి గుర్తించి సంబంధిత అధికారులతో చర్యలు జరపాలన్నారు. వరిధాన్యానికి ఏడు వందల గ్రాముల తరుగు తీయాల్సి ఉండగా.. కేంద్రాల వద్ద కిలో నుంచి 3 కిలోలు తీస్తున్నారు. పండించిన ప్రతి పంటను సర్కారు నిర్ణయించిన ధరలకే కొనుగోలు చేసి ఆదుకోవాలన్నారు.
పంట కోసి ఇప్పటికి పది రోజులైంది. ఇవాళ్టికి నాలుగు రోజుల నుంచి రోజు మ్యాచర్ను తెచ్చుకుని మొక్కజొన్నలను తెచ్చుకోమంటున్నారు. మేము దించుకోమంటే చెత్తలో పారేస్తానని వైస్ ఛైర్మన్ అంటున్నారు. -రైతులు
మాకు మ్యాచర్ వస్తే లారీలు రావట్లేదు. లారీలు వచ్చినా.. ఛార్జీలు పెరుగుతున్నాయి. పదిరోజుల నుంచి రోజూ వర్షాలు కురుస్తున్నాయి. ఇక్కడకు తెచ్చి పోసిన పంటపై పరదాలు కప్పి... అవి ఎక్కడ తడుస్తాయో అని బిక్కుబిక్కుమంటూ ఉంటున్నాం. -రైతులు