తెలంగాణ

telangana

By

Published : Jan 19, 2021, 5:11 AM IST

ETV Bharat / state

నేడు కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు సీఎం కేసీఆర్

మేడిగడ్డ ఆనకట్ట పరిశీలన నిమిత్తం ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కాళేశ్వరం వెళ్లనున్నారు. ముక్తేశ్వర స్వామి దర్శనం అనంతరం లక్ష్మీ ఆనకట్ట, పరిసర ప్రాంతాలను సీఎం సందర్శిస్తారు. ఇంజినీర్లు, అధికారులతో ఆనకట్ట వద్దే సమీక్ష నిర్వహించనున్న ముఖ్యమంత్రి... వారికి దిశానిర్దేశం చేస్తారు.

నేడు కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు సీఎం కేసీఆర్
నేడు కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కాళేశ్వరం పర్యటనకు వెళ్లనున్నారు. హెలికాప్టర్​లో ఉదయం 11 గంటలకు నేరుగా అక్కడకు వెళ్లనున్న సీఎం... కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఛైర్మన్, అర్చకులతో కాసేపు సమావేశమవుతారు. అనంతరం అక్కడి నుంచి మేడిగడ్డ వద్ద ఉన్న లక్ష్మీ ఆనకట్టకు చేరుకుంటారు.

లక్ష్మీ ఆనకట్ట వద్ద ప్రస్తుతం నీటిమట్టం పూర్తి నిల్వసామర్థ్యమైన 100 మీటర్లకు చేరుకొంది. గరిష్ట మట్టానికి చేరుకున్నప్పుడు జలాశయం, పరిసర ప్రాంతాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పట్నుంచో భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఇవాళ జలాశయం సహా పరిసర ప్రాంతాలను సీఎం పరిశీలిస్తారు.

విహంగ వీక్షణం...

విహంగవీక్షణంతో పాటు నేరుగా పర్యటించి ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను తెలుసుకుంటారు. అనంతరం అక్కడే ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. అధికారులు, ఇంజినీర్లతో సంబంధిత అంశాలపై చర్చిస్తారు. జలాశయంలో ప్రస్తుత నీటి పరిమాణం, ఎగువ నుంచి ప్రవాహం అవకాశాలు, దిగువకు విడుదల తదితర అంశాలపై సమీక్షిస్తారు.

ప్రాజెక్టులోని మొదటి, రెండో లింక్‌లో ప్రస్తుతం నీటి ఎత్తిపోతల కొనసాగుతోంది. ఆ ప్రక్రియను ముఖ్యమంత్రి ఇంజినీర్లతో సమీక్షించనున్నారు. కన్నెపల్లి, సిరిపురం, గోలివాడ పంప్​హౌస్​లో రెండు మోటర్లు... నంది పంప్ హౌస్, గాయత్రి పంప్ హౌస్​లో ఒక్కో మోటార్​ను నడిపిస్తూ... మధ్యమానేరు జలాశయానికి గోదావరి జలాలను తరలిస్తున్నారు.

సీఎం సమీక్ష...

దిగువ మానేరు జలాశయానికి 10 టీఎంసీలు, ఎల్లంపల్లిలో 2.5 టీఎంసీలు చేరేవరకూ ఎత్తిపోతలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. మూడో టీఎంసీ పనుల పురోగతిపైనా సీఎం సమీక్షించే అవకాశం ఉంది. సమీపంలోని ఎగువ ప్రాంతాలకు నీరు అందించే ప్రణాళికలపై చర్చించనున్నారు. వాటి ఆధారంగా అధికారులు, ఇంజినీర్లకు దిశానిర్దేశం చేస్తారు.

సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి హైదరాబాద్ తిరుగు పయనమవుతారు. సీఎం రాక దృష్ట్యా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఇదీ చూడండి:క్రికెటర్​ హనుమ విహారిని సత్కరించిన మంత్రి కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details