కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఉదయం కరీంనగర్ నుంచి హెలికాప్టర్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం చేరుకున్నారు. తొలుత గోదావరి ఘాట్కు వెళ్లి గోదావరికి ప్రత్యేక పూజలు చేశారు. కనుచూపు మేర జలనిధిగా మారిన ప్రాణహిత, గోదారి పవిత్ర జలాలను తల మీద చల్లుకొని పుష్పాభిషేకం చేశారు. నీటిలో నాణేలు వదిలి చీర, సారె సమర్పించారు.
అక్కడి నుంచి ఆలయంలోకి వెళ్లిన సీఎం కేసీఆర్కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న సీఎం.. అభిషేకం నిర్వహించి, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు సీఎంను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం లక్ష్మి బ్యారేజ్ను విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. బ్యారేజ్ మీద నుంచి నాణాలు వదిలి మొక్కులు చెల్లించుకున్నారు. నీటి నిర్వహణపై అధికారులు, ఇంజినీర్లతో సమీక్షించారు.
ఎప్పటికప్పుడు నీటిని తోడుకోవాలి
రాబోయే వర్షాకాలం వరద నీరు ఉద్ధృతంగా చేరుతుందని, లక్ష్మి బ్యారేజ్ నుంచి ఎప్పటికప్పుడు నీటిని తోడుకోవాలని, అందుకు సంబంధించిన వ్యవస్థను సిద్ధం చేసుకోవాలని ఈఎన్సీలు మురళీధర్ రావు, నల్ల వెంకటేశ్వర్లు, వోఎస్డీ శ్రీధర్ దేశ్పాండేలకు సూచించారు.
ఎంతో కష్టపడి కట్టుకున్న ప్రాజెక్టులలోని నీటిని ఎప్పటికప్పుడు తోడి పోసుకుంటూ రిజర్వాయర్లను నింపుతూ... గోదావరి జలాలు వృథా పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇంజినీర్లదే అన్నారు.