తెలంగాణ

telangana

ETV Bharat / state

మొత్తం 15 బృందాలు.. ఒక్కో జిల్లా నుంచి 400 నమూనాలు

భారతీయ వైద్య పరిశోధన మండలి ఆధ్వర్యంలో చేపట్టిన సిరో ప్రొవిలెన్స్‌ సర్వే రాష్ట్రంలో ప్రారంభమైంది. కమ్యూనిటీ స్థాయిలో ఇన్ఫెక్షన్‌ రేటు, కరోనా విస్తరణను గుర్తించడం సహా ప్రజల రోగనిరోధకశక్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ సర్వే దోహదపడనుంది. రోజురోజుకూ కొవిడ్‌ కేసులు పెరుగుతుండడం వల్ల ఈ సర్వే ప్రాధాన్యం సంతరించుకుంది. తొలివిడతలో భాగంగా ఇవాళ నల్గొండ, కామారెడ్డి, జనగామ జిల్లాల్లో వైద్య బృందాలు ర్యాండమ్‌ పద్ధతిలో ఇంటింటికీ వెళ్లి నమూనాలు సేకరిస్తున్నాయి.

By

Published : May 15, 2020, 8:27 PM IST

మొత్తం 15 బృందాలు.. ఒక్కో జిల్లా నుంచి 400 నమూనాలు
మొత్తం 15 బృందాలు.. ఒక్కో జిల్లా నుంచి 400 నమూనాలు

కరోనా కట్టడిలో భాగంగా కేంద్రం ప్రయోగాత్మక సర్వే నిర్వహిస్తోంది. ఐసీఎంఆర్​ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వైద్య బృందాలు.. గ్రీన్‌, ఆరేంజ్‌ జోన్లలో సిరో ప్రొవిలెన్స్‌ సర్వే చేపట్టాయి. తొలివిడతలో రాష్ట్రంలోని నల్గొండ, కామారెడ్డి, జనగామ జిల్లాలో ర్యాండమ్‌ పద్ధతిలో ఇంటింటి సర్వే నిర్వహించి ప్రజల నుంచి రక్త నమూనాలు సేకరిస్తున్నాయి. సర్వే కోసం జిల్లాకు 5బృందాల చొప్పున మొత్తం 15బృందాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఒక్కో జిల్లా నుంచి 400నమూనాలు సేకరించి వైద్య పరీక్షలకు పంపనున్నారు. ఈ సర్వే ద్వారా క్షేత్రస్థాయిలో కరోనా ప్రభావాన్ని అంచనా వేసి తదుపరి చర్యల కోసం కేంద్ర ప్రభుత్వం.. మరిన్ని వ్యూహాలు రూపొందించే అవకాశముంది.

యాంటీ బాడీస్‌ పరీక్షల ద్వారా ఆశించిన ఫలితాలు రాకపోవడం వల్ల ఐసీఎంఆర్​ ఎలీజా టెస్ట్‌ల వైపు మొగ్గుచూపుతోంది. ఈ మేరకు రాష్ట్రాలకు మార్గదర్శకాలు సైతం అందించింది. ఎలీజా పరీక్షల ద్వారా 97శాతానికి పైగా కచ్చితమైన ఫలితం వస్తుందని పేర్కొంది. కమ్యూనిటీ స్థాయిలో ఎంత మంది ఇన్ఫెక్షన్‌ బారిన పడ్డారనే విషయాన్ని గుర్తించేందుకే ఈ సర్వే ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేసింది.

నల్గొండ జిల్లాలోని నార్కట్‌పల్లి, కట్టంగూరు, మునుగోడు, నాంపల్లి మండలాల్లో పర్యటించిన కేంద్ర బృందాలు.. ఇంటింటికీ తిరుగుతూ నమూనాలు సేకరిస్తున్నాయి. అటు జనగామ జిల్లాలో ఎంపిక చేసిన తొమ్మిది గ్రామాల్లో అధికారులు.. నమూనాలు సేకరిస్తున్నారు. జిల్లాలో మూడ్రోజుల పాటు వీరి పర్యటన కొనసాగుతుంది. కామారెడ్డిలో అధికారులు రక్త నమూనా సేకరణపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారి నుంచి శాంపిల్స్ సేకరిస్తున్నారు. ఈ పరీక్షలు.. ప్రజల రోగనిరోధకశక్తిని అంచనా వేయడంతో పాటు వైరస్‌ లక్షణాలు కన్పించని వారిని గుర్తించేందుకు దోహదపడతాయి. ఇలా సేకరించిన వివరాలను ప్రభుత‌్వం విశ్లేషించి.. తదుపరి చేపట్టాల్సిన చర్యలను రూపొందించేందుకు వీలుపడుతుంది.

మొత్తం 15 బృందాలు.. ఒక్కో జిల్లా నుంచి 400 నమూనాలు

ఇదీ చదవండి:కరోనా మృతుల పక్కనే సాధారణ రోగులకు చికిత్స!

ABOUT THE AUTHOR

...view details