తెలంగాణ

telangana

ETV Bharat / state

Aasara Pension: 'అయ్యా నేను బతికే ఉన్నాను.. ఇదిగో చూడండి.. ఇది నేనే'

Aasara Pension in Jangaon: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందిస్తున్న పింఛన్ పథకాల అమల్లో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఆసరాగా నిలవాల్సిన ప్రభుత్వ పథకాలు చట్టుబండలవుతున్నాయి. లబ్దిదారులకు చేయూతనివ్వాల్సిన అధికారులు బతికి ఉన్న నిస్సహాయులను రికార్డుల్లో చంపేస్తున్నారు. మేము బతికే ఉన్నామంటూ.. ఏళ్ల తరబడిగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా గానీ, పింఛన్‌ ప్రయోజనాలకు నోచుకోవడం లేదు.

By

Published : May 2, 2023, 2:07 PM IST

Asara Pension
Asara Pension

అధికారుల నిర్లక్ష్యం.. బతికుండగానే చనిపోయినట్లు రికార్డుల్లో నమోదు

Aasara Pension in Jangaon: జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్​పూర్​కు చెందిన ఆమంచ రాజేంద్రం 2019లో ఆసరా పింఛనుకు దరఖాస్తు చేసుకోగా 2022 ఆగస్టులో గుర్తింపు కార్డు వచ్చింది. పింఛన్ డబ్బుల కోసం ఆశగా తపాలా కార్యాలయానికి వెళ్ళిన రాజేంద్రం.. జాబితాలో పేరు లేకపోవడంతో నిరాశ చెందాడు. అయినా ఆశచావక మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లగా రికార్డులు పరిశీలించిన అధికారులు.. రాజేంద్రం చచ్చిపోయాడని సెలవిచ్చారు. కళ్లముందు నిలువెత్తు మనిషి సజీవంగా ఉంటే చచ్చిపోవడమేంటని రాజేంద్రం నిలదీశాడు.

Asara Pension issues in Warangal: అయితే నీవు బతికే ఉన్నట్లు గ్రామపంచాయతీ నుంచి ధృవపత్రం తేవాలన్న అధికారుల సూచనతో.. అందుకోసం దరఖాస్తు చేసుకున్నాడు. అదే అదునుగా పంచాయతీ సిబ్బంది.. ఇంటి పన్ను బకాయిలన్నీ చెల్లించాలని షరతు పెట్టారు. అప్పుచేసి ఇంటిపన్ను చెల్లించిన రాజేంద్రం.. తన లైఫ్‌ సర్టిపికెట్‌ను మండల పరిషత్ కార్యాలయంలో సమర్పించాడు. అయినా ఆ రికార్డుల్లో ఇంకా తాను చనిపోయినట్లుగానే చెబుతున్నాయని ఆరోపిస్తున్నాడు రాజేంద్రం. కలెక్టర్‌కి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోతున్నాడు.

చనిపోయిన భర్త పేరు బదులు.. రికార్డుల్లో భార్య పేరు..: స్టేషన్‌ ఘన్​పూర్‌కు చెందిన నీరటి సునీత.. భర్త చనిపోతే వితంతు పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకుంది. ఐదేళ్ల తర్వాత పింఛన్‌ మంజూరైనట్లు అధికారులు సమాచారం ఇచ్చారు. పింఛన్‌ డబ్బు తీసుకునేందుకు వెళ్లిన సునీత అధికారులు చెప్పిన మాట విని ఖంగుతింది. చనిపోయిన తన భర్త పేరు బదులుగా ప్రభుత్వ రికార్డుల్లో తానే చనిపోయినట్లు నమోదు చేసినట్లు తెలుసుకుని నిర్ఘాంతపోయింది.

ఆ తర్వాత 3 నెలలు మండలం, కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగాక తప్పు సరిదిద్ది పింఛన్‌ చేతికిచ్చారు. అయితే ఈసారి సునీత చనిపోయినట్లు పౌరసరఫరాల విభాగం నమోదు చేయడంతో ఏడు నెలలుగా రేషన్‌బియ్యం అందడం లేదు. ప్రభుత్వ రికార్డుల్లో దొర్లుతున్న తప్పులు.. తమ బతుకల పాలిట గుదిబండగా మారుతున్నాయని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది.

నిస్సహాయస్థితిలో అవస్థలు పడుతున్న బాధితుడు: చాగల్లుకు చెందిన బాస్కులక్రిష్ణకు 2014లో దివ్యాంగుల పింఛన్‌ మంజూరైంది. 2019 వరకు ఆ పింఛన్ పొందిన కృష్ణ.. కరోనా సమయంలో రెన్యువల్ చేసుకోకపోవడంతో ఆగిపోయింది. ఆ తర్వాత మళ్లీ దరఖాస్తు చేసుకోగా పింఛన్‌ కార్డు వచ్చింది. అధికారులిచ్చిన ఆ కార్డు పట్టుకొని పోస్ట్​ఆఫీస్​కు వెళ్లిన కృష్ణకు.. అసలు పింఛనే మంజూరుకాలేదని సమాధానం వచ్చింది. పింఛన్‌ కోసం మళ్లీ మండలం, కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు.

అధికారుల నిర్లక్ష్యంతో..: నరాల బలహీనత వల్ల కృష్ణ సరిగా నడవలేడు.. కూర్చోలేని పరిస్థితి అన్నం భార్యే తినిపిస్తుంది. నిస్సహాయస్థితిలో అవస్థలు పడుతున్న తనకు పింఛన్ ఇప్పించాలని ప్రభుత్వాన్ని ప్రాధేయ పడుతున్నాడు ఆ దివ్యాంగుడు. అభాగ్యులను ఆదుకునేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న పింఛన్‌ పథకాలు.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా అభాసుపాలవుతున్నాయి. సర్కార్‌ సాయం కోసం ఎదురుచూస్తున్న నిస్సహాయుల ఆశలను ఆవిరిచేస్తున్నాయి.

'ఎంపీడీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్లాను. నా నెంబర్ వాళ్లకు చెప్తే.. వాళ్లు చూసి నువ్వు చనిపోయినట్లు ఉందని చెప్పారు. నువ్వు బతికి ఉన్నట్లుగా గ్రామపంచాయితీ కార్యాలయానికి వెళ్లి సర్టిఫికేట్ తీసుకొని రావాలన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లి అడిగితే.. వాళ్లు నాకు సర్టిఫికెట్ ఇచ్చారు. ఇది ఇచ్చే ముందు ఇంటి పన్ను కడితే లెటర్ ఇస్తామంటే ఇంటి పన్ను కూడా కట్టాను. సర్టిఫికెట్ తీసుకెళ్లి ఎంపీడీఓ ఆఫీస్​లో ఇచ్చాను. అది ఇచ్చి ఆరు నెలలైనా ఇప్పటికీ పింఛన్ మంజూరు కాలేదు.' -ఆమంచ రాజేంద్రం, ఆసరా పింఛన్ బాధితుడు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details