జగిత్యాల జిల్లా మెట్పల్లి శివారులోని వెంకట్రావుపేట వద్ద మిషన్ భగీరథ మెయిన్ పైప్లైన్ పగిలిపోయి ఆ ఊరంతా అతలాకుతలమయింది. తెల్లవారుజామున పైపు పగలడం వల్ల ఎవరూ గమనించలేదు. సుమారు గంటపాటు నీరు లీకవ్వడం వల్ల పక్కనే ఉన్న రెండు ఇళ్ల ప్రహరీ గోడలు కూలిపోయాయి. విగ్రహాల తయారీ కేంద్రంలోకి నీరు చేరి విగ్రహాలు కొట్టుకుపోయాయి.
భగీరథ పైపు లీకులమయం.. ఆ గ్రామం అతలాకుతలం
మిషన్ భగీరథ పైపులైన్ పగలడం వల్ల జగిత్యాల జిల్లా మెట్పల్లి శివారులోని వెంకట్రావుపేట గ్రామం అతలాకుతలమయింది. గంటపాటు సాగిన నీటి లీకేజీతో ఆ ప్రాంతమంతా నీటితో నిండిపోయింది.
నీటి ఉద్ధృతిలో కొట్టుకుపోయిన ఓ మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. పక్కనే ఉన్న ఇంట్లోకి నీరు చేరి సామగ్రి అంతా తడిచిపోయింది. నీటి ప్రవాహ ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల ఇంటి రేకులు పేకి లేచాయి.
సమాచారం అందుకున్న అధికారులు నీటి సరఫరాను నిలిపివేశారు. డబ్బా వాటర్ గ్రిడ్ నుంచి వేసిన మెయిన్ పైపులైన్ తరచూ లీకవుతుండటం వల్ల నీరంతా వృధాగా పోవడమే కాకుండా.. తమకు ఇబ్బంది కలిగిస్తోందని స్థానికులు అధికారులకు తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నీటి ఉద్ధృతితో నష్టపోయిన వారిని ఆదుకోవాలని కోరారు.
- ఇదీ చూడండి :మత్తులో డ్రైవింగ్.. ప్రాణాలపై లేదు కేరింగ్..