ఉత్తర తెలంగాణకే మణిహారమైన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పునరుజ్జీవ పథకంలో భాగంగా ప్రభుత్వం వరద కాల్వ ఆయకట్టును స్థిరీకరించింది. ఫలితంగా భూగర్భ జలాలు పెరగడమే కాకుండా చిన్ననీటి వనరులూ కళకళలాడుతున్నాయి. వరద కాల్వ దిగువ ప్రాంత రైతుల్లో ఆనందం తొణికిసలాడుతున్నా.. ఎగువ ప్రాంత రైతులు మాత్రం సాగునీటికి కటకటలాడుతున్నారు. సమీపంలోనే వరదకాల్వతో పాటు ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం అందుబాటులో ఉన్నప్పటికీ.. సాగునీటి వెతలు తీరడం లేదని గత కొన్నేళ్లుగా అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఈ క్రమంలో రైతుల మొరను ఆలకించిన సీఎం కేసీఆర్.. పురోగతి పనులకు పూనుకోవడంతో రైతుల్లో ఆశలు చిగురుస్తున్నాయి.
ఎస్సారెస్పీ ప్రాజెక్ట్లోని మిగులు జలాలను దిగువ ప్రాంతాలకు తరలించేందుకు వరద కాల్వ తవ్వినప్పటికీ తగినన్ని జలాలు అందుబాటులో లేకపోవడం వల్ల కాల్వ నిరుపయోగంగా మారింది. ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతంలో మహారాష్ట్ర సర్కార్ బాబ్లీతో పాటు మరిన్ని ఎన్నిపోతల పథకాలు నిర్మించారు. ఈ నేపథ్యంలో శ్రీరాంసాగర్పై ఆధారపడిన రైతులు సాగునీటికి ఇబ్బంది పడాల్సిన దుస్థితి నెలకొంది.
పునరుజ్జీవ పథకంతో నీరు పుష్కలం..
పునరుజ్జీవ పథకంతో వరద కాల్వలో నీరు పుష్కలంగా నిల్వ ఉంటున్నాయి. నీరున్నా సమృద్ధిగా ఉన్నప్పటికీ జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలోని మండలాల రైతులు మాత్రం ఇంకా సాగునీటికి ఇబ్బంది పడుతూనే ఉన్నారు.
ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వరద కాల్వ జగిత్యాల జిల్లా ఇబ్రాహీంపట్నం మండలంలో ప్రారంభమై మెట్పల్లి, కోరుట్ల, కథలాపూర్, మేడిపల్లి, జగిత్యాల, మల్యాల, పెగడపల్లి మండలాల మీదుగా 69 కిమీ మేర ఉంటుంది. ఈ ప్రాంతాల్లో దిగువ ఉన్న ప్రాంతాల చెరువులను నింపేందుకు 49 తూములు నిర్మించడం వల్ల 50వేల ఎకరాలకు సాగు నీరందుతోంది.