Peddapur Mallanna Bonalu: ఉత్తర తెలంగాణలోనే అతిపెద్దదైన పెద్దాపూర్ మల్లన్న బోనాల జాతర వైభవంగా జరిగింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్లో కొలువైన మల్లన్న స్వామి బోనాల జాతరను గత 35 ఏళ్లుగా ఘనంగా నిర్వహిస్తున్నారు. హోలీ పండుగ తర్వాత వచ్చే మొదటి ఆదివారం రోజున మల్లన్న స్వామికి బోనాలు తీయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఈ వేడుకలను శనివారం నుంచి సోమవారం(మార్చి 19 నుంచి 21) వరకు మూడు రోజులపాటు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు.
కమనీయం.. బోనాల ప్రదక్షిణం
భక్తులు 30 వేలకు పైగా బోనాలను మల్లన్న స్వామికి సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వేల బోనాలతో.. మహిళలంతా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న దృశ్యాలు కనువిందు కలిగించాయి. డప్పు చప్పుళ్లు, నృత్యాలతో ఆలయ ప్రాంగణం హోరెత్తింది.