తెలంగాణ

telangana

By

Published : May 22, 2021, 11:53 AM IST

ETV Bharat / state

కరోనా వికృత క్రీడలో ఛిద్రమవుతున్న కుటుంబాలు..!

కరోనా మహమ్మారి.. పచ్చని కుటుంబాలను ముక్కలు చేస్తోంది. ముచ్చటైనా బంధాలను ఛిద్రం చేస్తోంది. ఇవాళ ఇంట్లో ఉన్నా.. చూస్తుండగానే రేపు మట్టిలోకి చేరుతున్నారు. కళ్ల ముందే ఒక్కొక్కరుగా మాయమవుతున్నా.. నిస్సహాయులుగా కన్నీళ్లు కార్చటం తప్పిస్తే.. మరేమీ చేయలేని దైన్యం. ఆస్పత్రుల చుట్టూ తిరిగినా.. ఆస్తులు కరిగించినా.. ఆప్తులను మాత్రం దక్కించుకోలేకపోతున్నారు. కుటుంబాలకు కుటుంబాలను రాకాసి ఎగరేసుకుపోతుంటే.. ఇక ఆ ఇళ్లలో మిగిలిన వారి వేదన అరణ్యరోదనగా మారుతోంది.

కుటుంబాలకు కుటుంబాలను మింగేస్తోన్న కరోనా
కుటుంబాలకు కుటుంబాలను మింగేస్తోన్న కరోనా

కుటుంబాలకు కుటుంబాలను మింగేస్తోన్న కరోనా

కరోనా వికృత క్రీడలో చూస్తుండగానే భర్త ఊపిరి ఆగింది. కట్టుకున్న వాడు లేడనే నిజం నమ్మేలోపే.. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న మామ కాలం చేశాడు. గుండెలవిసేలా ఏడుస్తుండగానే.. మరిదిని మహమ్మారి కబళించింది. జగిత్యాలలోని గణేశ్​ నగర్​కు చెందిన దొంతుల సునీల్ ఇటీవల కరోనా బారిన పడి.. ప్రాణాలు విడిచాడు. మరో రెండ్రోజులకే ఆయన తండ్రి రామచంద్రం.. అంతలోనే సోదరుడు సుమన్​ మహమ్మారి కాటుకు బలయ్యారు. వారం రోజుల వ్యవధిలోనే ముగ్గురూ మృతి చెందగా.. కనీసం అంత్యక్రియలు కూడా చేసే వారు లేని పరిస్థితి నెలకొంది. కట్టుకున్న భర్త.. పెద్దదిక్కుగా ఉన్న మామ, బిడ్డలాంటి మరిది.. కళ్లముందే చనిపోవటంతో సునీల్​ భార్య వేదన అరణ్యరోదనగా మారింది.

జగిత్యాల గ్రామీణ మండలం చల్గల్​కు చెందిన ఎర్ర రాజేశం దంపతులతో పాటు ఆయన సోదరుడు కరోనా కాటుకు బలయ్యారు. ఇదే గ్రామానికి చెందిన పందిరి బీమలింగం.. ఆయన భార్య వైరస్​ సోకి ప్రాణాలు కోల్పోయారు. ఇంట్లో మిగిలిన బీమలింగం కుమారుడు, వృద్ధులైన తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

దిక్కుతోచని స్థితిలో పిల్లలు..

ఊహ తెలియని వయసులో తండ్రిని కోల్పోయి.. తల్లి సంరక్షణలో ఉన్న ఇద్దరు ఆడపిల్లలకు ఇప్పుడు కరోనా రాకాసి తల్లినీ దూరం చేసింది. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడివెండికి చెందిన కవితకు ఇద్దరు కుమార్తెలుండగా.. వారి పసిప్రాయంలోనే భర్త చనిపోయాడు. కూలీనాలీ చేసుకుంటూ పిల్లలను పెంచిన కవితమ్మ.. ఇద్దరిని ఉన్నత చదువులు చదివిస్తోంది. పెద్దమ్మాయి మౌనిక హోటల్ మేనేజ్​మెంట్​ చేస్తుండగా.. చిన్న కూతురు యామిని ఇంటర్ చదువుతోంది. ఇటీవల కరోనా బారినపడిన కవిత.. మహమ్మారి కాటుకు ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఇద్దరు ఆడపిల్లలు దిక్కులేనివారయ్యారు. వృద్ధాప్యానికి తోడు పక్షవాతంతో మంచానికి పరిమితమైన తాత నానమ్మలకు సేవలు చేస్తున్నారు. ఇన్నాళ్లు తల్లి సంరక్షణలో కష్టం తెలియకుండా పెరిగిన వారికి.. కరోనా రాకాసి తీరని వేదనను మిగిల్చింది.

ప్రభుత్వమే బాసటగా నిలవాలి..

ఇలా ఓ సునీల్ భార్య శ్రీదేవి.. భీమలింగం కుమారుడు అరుణ్, కవిత బిడ్డలే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా వందల కుటుంబాలు తమవారిని కోల్పోయి రోడ్డునపడ్డాయి. ఆప్తులను కాపాడుకునేందుకు సర్వశక్తులు ఒడ్డినా ఫలితం లేక, కనీసం చివరి చూపైనా దక్కక.. బాధితులు నరకయాతన అనుభవిస్తున్నారు. కరోనా వేళ బంధుత్వాలు మంటగలిసి, అనుబంధాలకు కాలం చెల్లిన పరిస్థితుల్లో ఇలాంటి వారికి ప్రభుత్వాలు బాసటగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇదీ చూడండి: తీవ్ర లక్షణాలు కనిపిస్తుంటే.. ఆలస్యం చేయొద్దు

ABOUT THE AUTHOR

...view details