తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్డుపై వధువు...ఆశావర్కర్ల ధర్నా...సినిమాకు తీసిపోని ట్విస్ట్​..! - cinema style marriage

bride struck in traffic: కల్యాణమండపంలో పెళ్లి పీటలపై ముహూర్తం సమయానికి తాళి కట్టించుకోవాల్సిన వధువు.. రోడ్డుపై ట్రాఫిక్​లో దర్శనమిచ్చింది. పెళ్లికి మాట్లాడుకున్న వీడియోగ్రాఫర్ల కెమెరాల్లో అందంగా కన్పించాల్సిన వధువును.. మీడియా కెమెరాలు కవర్​ చేశాయి. అందంగా ముస్తాబు చేసుకుని.. అలంకరించిన వాహనంలో రాకుమారిలా వెళ్లాల్సిన పెళ్లికూతురు.. బైక్​పై మండపానికి ఆలస్యంగా.. హడావిడిగా.. చేరుకుంది. ఈ ఆసక్తికర సన్నివేశం జగిత్యాలలో చోటుచేసుకుంది.

marriage postponed due to ashaworkers protest at jagtial
marriage postponed due to ashaworkers protest at jagtial

By

Published : Dec 8, 2021, 7:08 PM IST

Updated : Dec 8, 2021, 11:48 PM IST

bride struck in traffic: పూలతో కల్యాణమండపం ముస్తాబైంది. పెళ్లి పాటలు మారుమోగిపోతున్నాయి. వంటకాల ఘుమఘుమలు గుప్పుమంటున్నాయి. ఇవన్నీ కాదు..పెళ్లంటేనే ఎంతో సందడి.. హడావుడి. అదేనండీ.. కల్యాణమండపంలో సందడి.. బంధువుల హడావుడి. ఇక్కడ మాత్రం అవేవి కన్పించలేదు.

వరుడి ఎదురుచూపులు..

టీఆర్​నగర్​లో నివాసముంటున్న సాహితికి మధుకర్​తో పెళ్లి నిశ్చయమైంది. బైపాస్​ రోడ్డులోని నాయిబ్రాహ్మణ సంఘంలో ఇవాళ 12.30కు ముహూర్తం. సాధారణంగా అయితే.. వధువు తరఫు వాళ్లంతా ముందే కల్యాణమండపానికి చేరుకుని.. వరుడికి, అటువైపు బంధువులను ఎదుర్కోళ్లతో స్వాగతం పలుకుతారు. కానీ... ఇక్కడ అలా ఏం జరగలేదు. వరుడి తరపు వారు లోపలికి వెళ్లి మండపమంతా చూశారు. వధువుతో పాటు అటువైపు బంధువులెవ్వరూ కన్పించలేదు. ముహూర్తం దాటిపోతున్నా.. వధువు ఎప్పుడొస్తుందా..? వాళ్ల బంధువులెవరైనా కన్పించకపోతారా..? అని వేచిచూడటం వరుడు, అతడి బంధువుల వంతైంది.

బైక్​ మీద మండపానికి..

చివరికి.. పెళ్లిడ్రెస్​లో ఉన్న వధువును ఓ బైక్​పై ఆమె సోదరుడు రయ్యిమంటూ.. మండపానికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత మెల్లగా.. ఒక్కొక్కరిగా పెళ్లికూతురు బంధువులు మండపానికి చేరుకున్నారు. దీనంతటికీ కారణం.. ఆశాలు, ఏఎన్​ఎంలు. వాళ్లు నిర్వహించిన ధర్నా..!

ధర్నా ఎంత పని చేసింది..!

ashaworkers protest at jagtial: వధువుతో కలిసి కల్యాణమండపానికి పెళ్లి బృందం బయలుదేరింది. అదేసమయంలో.. కలెక్టరేట్‌ ముందు ఆశాలు, ఏఎన్‌ఎంలు ధర్నా నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ.. రాస్తారోకో నిర్వహించారు. వాళ్ల ధర్నాతో వాహనాలన్ని నిలిచిపోయాయి. పెళ్లి ఉందని.. తమను మాత్రమైనా వెళ్లనివ్వాలని ఆందోళనకారులను ఎంత బతిమాలినా.. వదల్లేదు. ధర్నాతో గంటకుపైగా.. ట్రాఫిక్​లోనే ఉన్నారు. అప్పటికీ ముహూర్తం సమయం దాటిపోయింది. అయినా వాళ్లు మాత్రం పెళ్లి బృందాన్ని వెళ్లనివ్వలేదు. ఇక చేసేదేమీ లేక.. ముస్తాబైన వధువునైనా తీసుకెళ్లేందుకు ఆమె సోదరుడు ఓ బైక్​ తీసుకొచ్చాడు. ధర్నాను దాటుకుని సోదరుని బైక్​పై పెళ్లికూతురు మండపానికి చేరుకుంది.

ఒక్కోక్కరుగా మండపానికి..

ఇక వధువు తరఫు బంధువులు ఒక్కొక్కరుగా ఆపసోపాలు పడుతూ మండపానికి చేరుకున్నారు. ముహూర్తం సమయం ఎలాగూ దాటిపోవటం వల్ల.. బంధువులు అందరు లేకపోయినా.. హడావుడిగా పెళ్లి తంతు ముగించేశారు. ఎట్టకేలకు.. సాహితి-మధుకర్​ల పెళ్లి జరిగిపోయింది.

ఆశాలు, ఏఎన్​ఎంల ధర్నా వల్ల ఓ పెళ్లిబృందం ఇబ్బంది పడటమే కాకుండా.. ఏకంగా వివాహామే కాసేపు నిలిచిపోయింది. ధర్నాలు వాళ్ల సమస్యలు పరిష్కరించుకోవటం కోసమే అయినా.. ఇలా అత్యవసరాలు ఉన్న వారికి సమస్యలు కలిగించటం సరైంది కాదని పెళ్లిబృందం వాపోయారు.

పెళ్లి ఆగిపోతే ఎవరిది బాధ్యత..?

"గంటసేపు బతిమాలినా మమ్మల్ని పంపించలేదు. ఇలా చేయటం కరెక్ట్​ కాదు. వాళ్ల సమస్య ఉంటే.. పరిష్కారం కోసం ధర్నా చేయటం తప్పు కాదు. కానీ.. ఎమర్జెన్సీ ఉన్న వాళ్లను గుర్తించి పంపించాలి. ముహూర్తం దాటిపోయినా.. మమ్మల్ని పంపించలేదు. ఏదైనా ఇష్యూ జరిగి పెళ్లి ఆగిపోతే.. వీళ్లు బాధ్యత తీసుకుంటారా..? కొంచెమైనా ఆలోచించాలి కదా.."- వధువు సోదరి

రోడ్డుపై వధువు...ఆశావర్కర్ల ధర్నా...సినిమాకు తీసిపోని ట్విస్ట్​..!

ఇదీ చూడండి:

Last Updated : Dec 8, 2021, 11:48 PM IST

ABOUT THE AUTHOR

...view details