తెలంగాణ

telangana

National Awards for Korutla Municipality : తెలంగాణకు వన్నె తెచ్చిన కోరుట్ల.. 4 ఏళ్లు.. 7 జాతీయ అవార్డులు

Korutla municipality wins National Awards : స్వచ్ఛ పట్టణం..హరితహారం..ప్రజా మరుగుదొడ్లు....పారిశుద్ధ్య నిర్వహణ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అక్కడి పాలకవర్గం, పురపాలక ఉద్యోగులు, సిబ్బంది, సమష్టిగా ముందుకెళ్తూ ఆ మున్సిపాలిటీకి అవార్డులు వచ్చేలా కృషి చేస్తున్నారు. నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ మున్సిపాలిటీ పేరును జాతీయస్థాయి వరకు తీసుకెళ్లారు అక్కడి సిబ్బంది. ఇసా ఇతర మున్సిపాలిటీలకు స్ఫూర్తిగా నిలుస్తోంది జగిత్యాల జిల్లాలోని కోరుట్ల మున్సిపాలిటీ.

By

Published : Jun 20, 2023, 10:32 AM IST

Published : Jun 20, 2023, 10:32 AM IST

Korutla
Korutla

తెలంగాణకు వన్నె తెచ్చిన కోరుట్ల జాతీయ అవార్డులు

National Award for Korutla : జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపాలిటీ పేరు చెప్పగానే ఇప్పుడు అందరికీ గుర్తు వచ్చేది అవార్డులు. నాలుగు సంవత్సరాల్లోనే ఏడు అవార్డులు దక్కించుకుని అందరి చేత భేష్ అనిపించుకుంటోంది కోరుట్ల మున్సిపాలిటీ. 85 వేల జనాభాతో కూడిన కోరుట్ల మున్సిపాలిటీలో 33వార్డులలో శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. పురపాలక పారిశుద్ధ్య కార్మికుల నుంచి పుర ఛైర్‌పర్సన్, కమిషనర్ వరకు సమష్టిగా బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నారు. పట్టణ పరిశుభ్రతకు పాటుపడుతూ స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్ది రాష్ట్ర, జాతీయస్థాయిలో వివిధ కేటగిరీలో అవార్డులను సొంతం చేసుకుంది.

Korutla municipality wins National Awards : 2022 సంవత్సరానికిగాను కోరుట్ల మున్సిపల్ ఉత్తమ మున్సిపాలిటిగా ఎంపికైయ్యింది. 2019లో నూతన మున్సిపల్ చట్టం ప్రకారం పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా మున్సిపాలిటీలో ప్రత్యేక వారోత్సవాలు నిర్వహించి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచారు. నిత్యం పారిశుధ్య కార్మికులు ప్రత్యేక వాహనాల ద్వారా ఇంటింటికి తిరిగి తడి, పొడి చెత్తను సేకరించి... దీని ద్వారా ఎరువును తయారుచేసి మంచి లాభాలు గడిస్తున్నారు. ప్రస్తుతం పట్టణంలో ఎటు చూసినా పచ్చదనం, పురపాలక కార్యాలయంలో కూడా పచ్చదనంతో కనివిందు చేస్తుంది.

'మా కోరుట్లకి జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చాయి. పట్టణ ప్రగతి అవార్డు వచ్చింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పట్టణ ప్రగతి కార్యక్రమంలో కేటీఆర్ చేతులమీదుగా ఉత్తమ మున్సిపాలీటిగా అవార్డు తీసుకున్నాం. హరితహారంలో కూడా మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాం. వీటన్నింటికి కారణం పట్టణ ప్రగతిలో ప్రజలు మాకెంతో సహకరించడమే. ముఖ్యంగా మహిళలు ఇందుకు కారణం. మహిళా ఉద్యోగులు ప్రతి ఇంటికి వెళ్లి పారిశుద్ధ్యంపై అందరికీ అవగాహన కల్పించారు.' - అయాజ్, మున్సిపల్‌ కమిషనర్.

పిచ్చి మొక్కలతో చిట్టడివిలా ఉండే శ్మశాన వాటికను ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి వైకుంఠధామంగా తీర్చిదిద్దారు. పట్టణంలోని మద్దెల చెరువును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి మినీ ట్యాంకుబండ్​గా మార్చేశారు. ప్రజలు సాయంత్రం వేళలో సేద తీర్చేందుకు చెరువుగట్టుపై ఆకర్షణీయమైన కట్టడాలను నిర్మించారు. పిల్లలకు ఉల్లాసాన్నిచ్చేందుకు పార్కును ఏర్పాటు చేశారు. ఇలాంటి మున్సిపాలిటీలో విధులు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

'మా కమిషనర్​ టైం టూ టైం సీడీఎమ్​ఏ దగ్గరి నుంచి కానీ ఆర్డీఎమ్​ఏ దగ్గర నుంచి కానీ వచ్చిన ఆదేశాలను మాకు ఇచ్చి దిశానిర్దేశం చేస్తారు. కోరుట్ల మున్సిపాలిటీ పేరు జాతీయ స్థాయిలో వినిపించడానికి మా కమిషనర్​ ఎంతో కృషి చేశారు.' - శేఖర్, పురపాలకశాఖ ఉద్యోగి

రానున్న రోజుల్లో ఇదే స్ఫూర్తితో మరిన్ని అవార్డులు సాధించే దిశగా పురపాలక శాఖ అధికారులు అడుగులు వేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అందుకు ప్రజలు ఇదే విధంగా తమకు సహకరించాలని కోరారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details