Teen Crashes into White House With Truck In America : అమెరికా అధ్యక్ష భవనమైన వైట్హౌస్ వద్ద ఓ యువకుడు ట్రక్కుతో దాడికి యత్నించడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనలో నిందితుడైన 19 ఏళ్ల కందుల సాయి వర్షిత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని తెలుగు సంతతికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడిని విచారించగా.. ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి చూశాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను హత్య చేయాలనే లక్ష్యంతో నిందితుడు ఉద్దేశపూర్వకంగానే ఈ దాడికి యత్నించినట్లు పోలీసుల విచారణలో తెలిసింది.
Sai Varshith Update News : దీనికి సాయి వర్షిత్ ఆరు నెలలుగా ప్లాన్ చేసి మరీ ఘటనకు పాల్పడినట్లు తేలింది. విచారణలో అతడు ఆ విషయాన్ని అంగీకరించినట్లు సీక్రెట్ సర్వీస్ ఏజెండ్ వర్గాలు మీడియాకు తెలిపాయి. స్థానిక కాలమానం ప్రకారం.. సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలను అధికారులు మీడియాకు వెల్లడించారు. వాటి ప్రకారం.. సాయి వర్షిత్ సోమవారం రాత్రి సెయింట్ లూయిస్ నుంచి వాషింగ్టన్లోని డ్యుల్లెస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు చేరుకొని, ఆ తర్వాత యూ-హాల్ సంస్థ వద్ద ఓ ట్రక్కును అద్దెకు తీసుకుని నేరుగా వైట్హౌస్ వెలుపల ఉన్న సైడ్వాక్ వద్దకు వెళ్లాడు.
అతన్ని చంపాలని ఆరు నెలలుగా ప్లాన్ చేశా!: శ్వేతసౌధం ఉత్తరభాగం వైపు భద్రత నిమిత్తం ఏర్పాటు చేసిన ట్రాఫిక్ బారియర్స్ను ఢీ కొట్టాడు. ఆ తర్వాత ట్రక్కును రివర్స్ చేస్తూ మరోసారి ఢీ కొట్టాడు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది.. వెంటనే సాయి వర్షిత్ అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను చెప్పిన విషయాలకు పోలీసులు కంగుతిన్నారు. ఈ దాడి కోసం తాను ఆరు నెలలుగా ప్లాన్ చేసినట్లు సాయి వర్షిత్ చెప్పాడు. అలాగే దాడికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తన గ్రీన్బుక్లో రాసుకున్నట్లు తెలిపాడు.