గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతే లక్ష్యంగా చేపట్టిన పల్లెప్రగతితో ఎన్నో సత్ఫలితాలు వస్తున్నాయని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామం ఇప్పుడు యావత్దేశాన్ని ఆకట్టుకున్న గంగదేవిపల్లిగా మారుతోందన్నారు. ఇప్పటికే చేపట్టిన పనుల తనిఖీకి 51మంది అఖిల భారత సర్వీసు అధికారులు బుధవారం నుంచి పర్యటించనుండగా..రెండో తేదీ నుంచి రెండో విడత పల్లెప్రగతి కార్యక్రమం చేపట్టనున్నారు. ఈనేపథ్యంలో ‘ఈనాడు’తో ముఖాముఖీలో మంత్రి దయాకర్రావు పలు విషయాలను వెల్లడించారు.
పల్లెప్రగతిలో ప్రజల భాగస్వామ్యం పెంచేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారు?
ప్రతి పంచాయతీలోనూ పూర్వవిద్యార్థుల సమ్మేళనాలు నిర్వహించాలనుకుంటున్నాం. సర్పంచి..పూర్వవిద్యార్థులతో సమావేశం నిర్వహించి గ్రామాభివృద్ధికి సాయాన్ని కోరాలి. ప్రవాసులతో ఫోన్లో మాట్లాడాలి. పూర్వపు విద్యార్థుల్లో కూలీలుంటే వారిని ఒకరోజు శ్రమదానంలో పాల్గొనాలని కోరాలి. మొదటి విడత పల్లెప్రగతిలో రూ.24కోట్ల విరాళాలు వచ్చాయి. దాతల పేర్లను బోర్డుపై రాసిపెట్టాలి.
ప్రతి పంచాయతీ ట్రాక్టర్ కలిగి ఉండాలని రెండోవిడత పల్లెప్రగతిలో చేర్చారు. 95శాతం చిన్నపంచాయతీలే ఉన్నందునా వాటికి ట్రాక్టర్లను నిర్వహించే సామర్థ్యం ఉంటుందా?
300 జనాభా ఉన్న పంచాయతీకి సైతం ఏడాదికి రూ.8లక్షల చొప్పున ప్రభుత్వమిస్తోంది. చిన్నపంచాయతీలు చిన్న ట్రాక్టరును కొనుక్కోవచ్చు. ఖరీదు తక్కువే. చెత్తను సేకరించేందుకు ట్రైసైకిళ్లను, చెత్తను డంపిగ్యార్డుకు చేరవేసేందుకు, మొక్కలకు నీళ్లు పోయటానికి ట్రాక్టర్ను ఉపయోగించాలి.
ప్రభుత్వం చెప్పే పనులు చేయాలంటే పంచాయతీలకు తగిన ఆదాయం ఉండాలి. రాబడుల పెంపుపై అధ్యయనం చేయిస్తారా?
పంచాయతీలకు నిధుల కొరతలేదు. కేంద్ర, రాష్ట్ర వాటాలతో వాటికి ప్రతినెలా రూ.339కోట్ల చొప్పున ఇస్తున్నాం. అవి ఆస్తిపన్నును నూరుశాతం వసూలు చేసుకోవాలి. ఆస్తులకు సరైన విలువను లెక్కగట్టి వాటి ఆధారంగా పన్నును మదించాల్సిన అవసరముంది. రోడ్లపై చెత్తవేస్తే రూ.500జరిమానా వంటివి చట్టంలో ఉన్నాయి. శ్మశానవాటికలు, డంపింగ్యార్డులు, నర్సరీలు, మంచినీరు తదితరాలకు ప్రభుత్వమే నిధులు సమకూరుస్తోంది. అందువల్ల తమ రాబడులతో పాలకవర్గాలు చాలా పనులు చేయించవచ్చు.
పల్లెప్రగతిలో సామాజిక పరివర్తన అంశాలకు ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వదలిచారు?