భయమో, జాగ్రత్తో..! మొదటి దశ కరోనా నుంచి చాలా మంది తప్పించుకున్నారు. కానీ.. ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయింది. రెండో దశలో కళ్లు మూసి తెరిచేలోగా...వేలాది మందిని అంటుకుంటోంది వైరస్. వీరిలో పెద్దలే కాదు... చిన్నారులూ ఎక్కువగానే ఉంటున్నారు. సెకండ్ వేవ్లో ఎక్కువగా ఆందోళనకు గురి చేస్తోంది...ఈ పరిణామమే. మొదటి దశలో పిల్లలపై పెద్దగా ప్రభావం చూపని కొవిడ్.. ఇప్పుడు వారిపైనా విరుచుకుపడుతోంది. గతేడాదితో పోల్చితే ఈ కేసుల సంఖ్య రెండింతలుగా ఉందని నిపుణులు చెబుతున్నారు. 10 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న వారిపై ఎక్కువగా కరోనా దాడి చేస్తోంది. 1–8 మధ్య వయసున్న వారిలో స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయి. ఎందుకిలా జరుగుతోంది? నిపుణులు చెబుతున్న జాగ్రత్తలేంటి?
అధికారిక గణాంకాలు లేవు
నెలల వయసున్న పిల్లల దగ్గర్నుంచి దాదాపు 14 ఏళ్ల వయసున్న చిన్నారుల దాకా ఎక్కువ మంది ఈ వైరస్ బారిన పడుతున్నారు. తద్వారా వారిలో తక్కువ, మధ్య స్థాయి లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. గతేడాది కూడా పిల్లలకి కరోనా సోకినప్పటికీ వారిలో లక్షణాలు లేకపోవడం వల్ల... ఆ వార్తలు పెద్దగా బయటకి రాలేదు. కరోనా వారికి ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు పోయిందో తెలిసే అవకాశం లేదంటున్న వారూ ఉన్నారు. గతేడాది చిన్నపిల్లల్లో 1 శాతం మందికి కరోనా సోకితే, ఈ సారి 1.2 శాతం మందికి సోకింది. శాతాల్లో చూస్తే తక్కువగానే కనిపించినా సంఖ్యలో ఇది చాలా ఎక్కువ. ప్రభ్వుత్వం పిల్లల్లో కరోనాకి సంబంధించి ఎలాంటి అధికారిక గణాంకాలు విడుదల చేయడం లేదంటున్నారు..పలువురు నిపుణులు.
భిన్నంగా లక్షణాలు
కరోనా వైరస్ తొలి నాళ్లలో శ్వాస వ్యవస్థపై తీవ్రంగా ప్రభావం చూపినా.. ఇప్పుడు శరీర అవయవాలన్నింటినీ తన అధీనంలోకి తెచ్చుకుంటోంది. ఈ క్రమంలో రోజుకో కొత్త లక్షణం బయటపడుతోంది. పెద్దలతో పోల్చితే పిల్లల్లో ఈ వైరస్ లక్షణాలు భిన్నంగా ఉన్నాయని హార్వర్డ్ హెల్త్లో ప్రచురితమైన ఓ నివేదిక చెబుతోంది. ఇందులో భాగంగా కొంతమంది చిన్నారుల్లో అసలు లక్షణాలేవీ కనిపించట్లేదని, మరి కొంతమందిలో కొన్ని అనారోగ్యాల ద్వారా కొవిడ్ సోకిందని అనుమానించి పరీక్ష చేయించాలని సూచిస్తోంది. మరి చిన్నారులకు కరోనా సోకిందని ఎలా తెలుస్తుంది..? ఏయే లక్షణాలుంటే... వైరస్ బారిన పడ్డారని అనుమానించాలి..? వారిని వైరస్ బారి నుంచి బయటపడేయాలంటే... ఏం చేయాలి?
న్యుమోనియాకు దారి
103-104 డిగ్రీల ఫారన్ హీట్ శరీర ఉష్ణోగ్రతతో కూడిన జ్వరం ఉండి.. నాలుగైదు రోజుల పాటు ఇలాగే కొనసాగితే... అది కరోనా లక్షణంగా భావించాలంటున్నారు వైద్యులు. జ్వరంగా ఉందనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా నిరంతరం వారి శరీర ఉష్ణోగ్రత, బీపీ, ఆక్సిజన్ స్థాయుల్ని పరీక్షించుకుంటూ ఉండాలి. గ్యాస్ట్రిక్ సమస్యలు, ఆకలి మందగించడం, వాంతులు, విరేచనాలు, దద్దుర్లు, కంటి ఇన్ఫెక్షన్, రక్తనాళాల్లో వాపు, పొడి దగ్గు, గొంతునొప్పి రుచి, వాసన కోల్పోవడం, పెదాలు పగలడం, ఎరుపెక్కడం, ముక్కుదిబ్బడ ఎక్కువ రోజుల పాటు కొనసాగడం లాంటివి కనిపించినా... కరోనా పరీక్ష చేయించాలి. కొంతమంది చిన్నారుల్లో ఎక్కువ రోజుల పాటు వేధించే జలుబు క్రమంగా న్యుమోనియాకు దారి తీస్తుందట. అందుకే.. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు.