సింగరేణిలోని ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ ఆరు నెలల్లో భర్తీ చేస్తామని సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ వెల్లడించారు. నియామక ప్రక్రియలో అంతర్గత కోటా పెంచుతామన్నారు. అర్హులైన కార్మికులకు ఉన్నత ఉద్యోగాలకు అవకాశం ఇస్తామని పేర్కొన్నారు.
హైదరాబాద్ సింగరేణి భవన్లో 46వ రక్షణ త్రైపాక్షిక సమావేశం జరిగింది. గనుల్లో సాంకేతిక, వైద్య సిబ్బంది, సూపర్ వైజర్లు, స్పెషలిస్టు వైద్యులు తదితర పోస్టులను వెంటనే భర్తీ చేస్తే రక్షణ పెరుగుతుందని యూనియన్ల ప్రతినిధులు సూచించారు. గనుల్లో రక్షణ చర్యల కోసం రాజీపడే ప్రసక్తే లేదని.. ఎంత ఖర్చయినా వెనకాడేది లేదని సీఎండీ స్పష్టం చేశారు.
ఐదేళ్లలో సింగరేణిలో ప్రత్యక్ష, కారుణ్య, అంతర్గత నియామకాల ద్వారా సుమారు 16 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు తెలిపారు. దేశంలో ఏ సంస్థ చేపట్టని విధంగా కొవిడ్ నివారణ చర్యలు చేపట్టినట్లు సీఎండీ శ్రీధర్ వివరించారు.
రానున్న కాలంలో ప్రైవేటు కంపెనీలు, విదేశీ బొగ్గుతో గట్టి పోటీ ఉండబోతోందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. సమష్టి కృషితో.. నైపుణ్యాన్ని పెంచుకుంటూ, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవాలని సీఎండీ కోరారు. ఈ సమావేశానికి సింగరేణి యాజమాన్య ప్రతినిధులు, ఉన్నతాధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.
ఇవీచూడండి:వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం