సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వస్తోంది. ఏడు కీలక విశ్వవిద్యాలయాల ఎంపిక కమిటీల సమావేశాలు పూర్తయ్యాయి. ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయూహెచ్, శాతవాహన, అంబేడ్కర్, తెలంగాణ, మహాత్మగాంధీ యూనివర్సిటీల ఎంపిక కమిటీలు కసరత్తు పూర్తి చేశాయి. ఒక్కో వర్సిటీకి ముగ్గురి పేర్ల చొప్పున ప్రభుత్వానికి పంపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదిస్తే.. వాటిని గవర్నర్ కార్యాలయానికి పంపించనున్నారు. గవర్నర్ వారిని ఖరారు చేస్తారు.
కమిటీ అవసరం లేకుండానే
పట్టభద్రుల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనందునందున ఎన్నికల సంఘం అనుమతి తీసుకుని నాలుగైదు రోజుల్లోనే వీసీల నియామక ప్రకటన విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏ రోజైనా ప్రకటన రావచ్చన్న ఉద్దేశంతో యూనివర్సిటీ వీసీల కార్యాలయాలను ఇప్పటికే ముస్తాబు చేశారు. పాలమూరు యూనివర్సిటీ సమావేశం... సోమ లేదా మంగళవారంలో జరిగే అవకాశముంది. బాసర రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక యూనివర్సిటీకి ఎంపిక కమిటీ అవసరం లేకుండానే నేరుగా వీసీని నియమించే అధికారం... ప్రభుత్వానికి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వీసీ నియామకానికి కొంత సమయం పట్టొచ్చని ఉన్నత విద్యా శాఖ వర్గాలు చెబుతున్నాయి.