VenkaiahNaidu Respond on Education in Mother Tongues :దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో విద్యాబోధనకు కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ చొరవ తీసుకోవడం ఆనందదాయకమని.. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మాతృ భాషలో విద్యాబోధన జరగాలని తాను చాలాసార్లు సూచిస్తూనే ఉన్నానని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక జాతీయ విద్యా విధానం-2020 దూరదృష్టికి అనుగుణంగా.. భారతీయ భాషలు - మాతృభాష బోధనా మాధ్యమంగా స్వీకరించడానికి కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల కాపీని జత చేస్తూ ఆయన ట్వీట్ చేశారు.
Venkaiah Naidu Tweet Today :భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో పొందుపరిచిన 22 భాషల్లో పాఠ్య పుస్తకాలు సిద్ధం చేయడానికి.. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ - ఎన్సీఈఆర్టీ ఉపక్రమించడం ముదావహం అని వెంకయ్యనాయుడుసంతోషం వ్యక్తం చేశారు. ప్రాధమిక విద్యా స్థాయి 12వ తరగతి వరకు ఈ 22 మాతృ భాషల్లో.. ఏ భాషలోనైనా సరే విద్యాబోధన ఎంచుకోవాలనే ఐచ్చికం సీబీఎస్ఈ ఇవ్వటం ఆనందదాయకమని తెలిపారు. సాధారణంగా సామాజికంగా, ఆర్థికంగా మన సర్వతోముఖాభివృద్ధిని అడ్డుకుంటున్న వలస పాలన అవశేషాలకు చరమగీతం పాడాల్సిన సమయమని స్పష్టం చేశారు. స్థానిక భాషలకు సమ ప్రాధాన్యం ఇవ్వాల్సిన తరుణం ఇదేనని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.
CBSE Schools Allowed Teach Mother Tongue :కేంద్రీయ విద్యాలయాలు, ఇతర సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల్లో.. పూర్వప్రాథమిక స్థాయి నుంచి 12వ తరగతి వరకు మాతృభాషల్లో విద్యాబోధనను ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలోనే సీబీఎస్ఈ తన అనుబంధ పాఠశాలలకు సర్క్యులర్ జారీ చేసింది. బోర్డు పరిధిలోకి వచ్చే అన్ని విద్యాలయాల్లో మాతృభాషను బోధనా మాధ్యమంగా చేసుకొని బహుభాషా విద్యను ప్రోత్సహించాలని అందులో తెలిపింది.
పిల్లలు పూర్వప్రాథమిక స్థాయి నుంచే తమ మాతృభాషపై ప్రత్యేకదృష్టి సారించడంతోపాటు.. ఇతర భాషలను తెలుసుకుంటే.. బహు భాషావాదం చిన్నారుల ఆలోచనా పరిధిని విస్తృతం చేస్తుందని జాతీయ విద్యావిధానం-2020 కూడా బలంగా చెబుతోంది. కనీసం 5వ తరగతి వరకైనా ఈ విధానం అనుసరించాలని, 8వ తరగతి.. ఆ తర్వాత కూడా ఇదే విధానం మేలని నిర్దేశిస్తోంది. బహుభాషా విద్యావిధానం అమలుకు, బోధనా భాషగా మాతృభాష వాడకానికి ప్రస్తుతం కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి.