తెలంగాణ

telangana

ETV Bharat / state

మూడు కిలోమీటర్లే హద్దు... మరిచారో ఇకపై జప్తు! - Police Two wheelers Seize

ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించినా కొందరు వాహనదారులు యథేచ్ఛగా రోడ్లపై విహరిస్తున్నారు. నిర్మానుష్యంగా ఉన్న రహదారులపై అతివేగంగా దూసుకెళ్తున్నారు. వీరిని గుర్తించేందుకు పోలీసులు ప్రత్యేకంగా దృష్టిసారించారు. సీసీ కెమెరాలను పరిశీలించి నిబంధనలు ఉల్లంఘించే వారిపై కొరడా ఝళిపించే పనిలో పడ్డారు.

3 కి.మీ. హద్దు ... మరిచారో ఇకపై జప్తు!
3 కి.మీ. హద్దు ... మరిచారో ఇకపై జప్తు!

By

Published : Mar 29, 2020, 11:17 AM IST

దేశమంతా ప్రస్తుతం లాక్​డౌన్ కొనసాగుతోంది.​ అత్యవసర సేవల విభాగాల వాహనాలకే నగరంలో సంచరించేందుకు అనుమతులున్నాయి. మిగిలినవారెవరైనా నిత్యావసరాలకు ద్విచక్ర వాహనాలు, కార్లపై తమ నివాసం నుంచి 3 కి.మీ.లోపే ప్రయాణం చేయాలని స్పష్టమైన ఆదేశాలున్నాయి. అయినా కొందరు నిబంధనలు ఉల్లంఘిస్తూ స్వేచ్ఛగా రహదారులపై స్వైర విహారం చేస్తున్నారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ ఉన్నతాధికారులు వెల్లడించారు.

సీసీ కెమెరా దృశ్యాల పరిశీలన...

మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువదూరం తిరిగిన వాహనదారులను గుర్తించేందుకు ట్రాఫిక్‌ కూడళ్లు, ఇతర ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను పోలీసులు ఉపయోగించుకుంటున్నారు. కమాండ్‌ కంట్రోల్‌ ద్వారా విశ్లేషించి నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదుచేస్తున్నారు.

ఓ కారుకు ఇ-చలానా...

ఈనెల 25న ఉదయం 9.33 గంటలకు నల్గొండ క్రాస్‌రోడ్స్‌లో బయల్దేరిన ఓ కారు... 12.59 గంటలకు సాగర్‌ సొసైటీ కేబీఆర్‌ పార్కు వద్ద... తరువాత శ్రీనగర్‌ టీ-జంక్షన్‌ వద్ద... 1.07 గంటలకు రవీంద్రభారతి కూడలిలో సీసీ కెమెరాల కంటపడింది. ఎలాంటి ప్రత్యేక అనుమతులు లేకున్నా... ఇలా ఎందుకు తిరిగిందో గుర్తించే పనిలో పోలీసులు పడ్డారు. ఇ-చలానా పంపేందుకు సిద్ధమయ్యారు.

ఇకపై వాహనాల స్వాధీనం...

ప్రస్తుతం కేసులతో సరిపెడుతున్నామని, సోమవారం నుంచి వాహనాలను స్వాధీనం చేసుకుంటామని అధికారులు తెలిపారు. ఇక లాక్‌డౌన్‌ సందర్భంగా శనివారం పోలీసులు 8513 వాహనాలపై కేసులు నమోదుచేశారు. వీటిలో ద్విచక్రవాహనాలే 8093 వరకు ఉండడం గమనార్హం.

ఇదీ చూడండి:ఇంట్లో గది లేక చెట్టుపై క్వారెంటైన్​ కేంద్రం!

ABOUT THE AUTHOR

...view details