అవిభక్త కవలలు అని అనగానే టక్కున గుర్తేచ్చేవారు వీణావాణీ. ప్రాణాలు రెండు దేహాలు ఒకటిగా గత పదహారేళ్లుగా వారిద్దరు కలిసే పెరుగుతున్నారు. ఇవాళ 17వ పుట్టిన రోజు జరుపుకున్నారు. పుట్టిన నాటి నుంచి 14 ఏళ్లు వచ్చే వరకు నీలోఫర్ ఆస్పత్రిలో గడిపిన వీణా వాణీలను స్టేట్ హోం అక్కున చేర్చుకుంది. ప్రస్తుతం వీరిద్దరు పదో తరగతి చదువుతున్నారు. వీళ్లకోసం స్టేట్ హోం అధికారులు ప్రత్యేకంగా ఉపాధ్యాయుల్ని నియమించారు. స్టేట్ హోంలో సంతోషంగా ఉన్నామని వీణావాణీ చెబుతున్నారు.
పిల్లలు ఎదిగే కొద్దీ ఇబ్బంది
పిల్లలు పదిహేడో పడిలోకి అడుగుపెట్టారని సంతోషించాలో లేక.. వయసు పెరుగుతున్నా శస్త్రచికిత్స జరగలేదని బాధ పడలో అర్థం కాని పరిస్థితి వారి తల్లిదండ్రులది. 2006లో ముంబయికి చెందిన బ్రీచ్ కాండీ ఆస్పత్రి, 2009లో సింగపూర్ వైద్యులు శస్త్రచికిత్సకు పచ్చజెండా ఊపారు. శస్త్రచికిత్స ఖర్చులు భరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఆ సమయంలో పిల్లల ఆరోగ్యానికి భరోసా లేదని తల్లిదండ్రులు అంగీకరించలేదు.
పిల్లల దగ్గరే ఉపాధి కల్పించండి
2012లో లండన్కి చెందిన గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ వారు ముందుకొచ్చి శస్త్రచికిత్స అనంతరం ఇద్దరినీ కాపాడుకునేందుకు 80శాతం అవకాశం ఉందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు కూడా అంగీకరించారు. కోర్టు నుంచి అనుమతి లభించింది. కానీ సర్కారు మాత్రం పిల్లల ప్రాణాలకు వంద శాతం భరోసా ఉంటేనే శస్త్రచికిత్సకు అంగీకరిస్తామని తేల్చింది. బిడ్డల పుట్టిన రోజున వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎదుగుతున్న పిల్లలకు ఇప్పటికైనా శస్త్ర చికిత్స చేయించాలని... పిల్లల సమక్షంలో ఉండేందుకు వారికి స్టేట్హోంలోనే ఉపాధి కల్పించాలని కోరుతున్నారు.
వీణా వాణీలు మాత్రం తమకు కలిసి ఉండటమే సంతోషంగా చెబుతున్నారు. అయితే పిల్లల వయసు పెరిగే కొద్దీ కలిసి ఉండటంలో అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. శస్త్రచికిత్సకు కూడా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుందని గతంలోనే వైద్యులు స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి పిల్లలకు ఆపరేషన్ చేయించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
వీణావాణీల భవిష్యత్ ఏమిటి..? ఇదీ చూడండి: అలర్ట్: బయటకు వెళ్తున్నారా... అయితే గొడుగు తీసుకెళ్లండి!