ఎంతోమందికి ప్రాణం పోసిన ఆ వైద్యురాలు... తనకు పుట్టిన బిడ్డను కళ్లారా చూసుకోకుండానే కన్నుమూశారు. కరోనా(corona) మహమ్మారితో పోరాడి... విధి ఆడిన వింత నాటకంలో ఓడిపోయారు. కొవిడ్(covid) బారిన పడి ఆరోగ్యం విషమించిన పరిస్థితిలో బిడ్డకు జన్మనిచ్చిన ఉత్తరప్రదేశ్కు చెందిన వైద్యురాలు.. 140 రోజులు మృత్యువుతో పోరాడి హైదరాబాద్లోని ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.
నిండు గర్భిణీ... కరోనాతో పోరాడి..
యూపీకి చెందిన 32ఏళ్ల డాక్టర్ శారదా సుమన్(Dr Sharada Suman).. లఖ్నవూలోని రామ్ మనోహర్ లోహియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో రెసిడెంట్ డాక్టర్గా పనిచేసేవారు. భర్త అజయ్ కుమార్ కూడా వైద్యుడే. ఈ ఏడాది ఏప్రిల్లో కరోనా రెండో దశ విజృంభణ సమయంలో ఆమె ఎంతోమంది కరోనా రోగులకు చికిత్స చేసి ఇళ్లకు పంపారు. వృత్తినే దైవంగా నమ్మే ఆమె.. నిండు గర్భిణీ అయినా జాగ్రత్తలు తీసుకుంటూనే రోగులకు సేవలందించి ప్రశంసలు పొందారు. ఇలా సాఫీగా సాగుతున్న ఆమె జీవితంపై కరోనా రక్కసి పగబట్టింది.
బిడ్డను చూసుకోలేదు
ఏప్రిల్ 14న శారద కొవిడ్ బారినపడ్డారు. అప్పటికి ఆమె 8 నెలల గర్భవతి. వారం పాటు ఆరోగ్యం సవ్యంగానే ఉన్నా.. తర్వాత విషమించింది. వెంటిలేటర్ సాయంతో చికిత్స అందించారు. తర్వాత ఊపిరితిత్తుల్లో గడ్డలు(ఫైబ్రోసిస్) వచ్చినట్లు గుర్తించారు. మే 1న అత్యవసర శస్త్రచికిత్స చేసి పురుడుపోశారు. పండంటి ఆడబిడ్డ పుట్టింది. అప్పటికే శారద ఆరోగ్యం విషమించడంతో ఎక్మో సాయంతో ఊపిరి అందించారు. కళ్లు తెరిచి బిడ్డను కళ్లారా చూసుకునే పరిస్థితిలో కూడా ఆమె లేదు.