విద్యుత్ బకాయిలు సహా విభజన సమస్యల విషయంలో రాష్ట్ర వాదనలను బలంగా వినిపించాలని చట్టం, న్యాయపరంగా తెలంగాణకు రావాల్సిన వాటిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన సమస్యలపై నేడు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో దిల్లీలో జరగనున్న సమావేశానికి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి నేతృత్వంలోని అధికారులబృందం హాజరుకానుంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య విభజన సమస్యలు, వివాదాల పరిష్కారంపై రెండు రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి భేటీ కానున్నారు. విద్యుత్ బకాయిలు, సింగరేణి సంస్థ అనుబంధ ఆప్మెల్, పారిశ్రామిక రాయతీలు, పౌరసరఫరాల సంస్థ నిధులకు సంబంధించిన అంశాలు అజెండాలో ఉన్నాయి. దిల్లీలో జరిగే సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున వినిపించాల్సిన వాదనలపై ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ చర్చించారు. పూర్తిస్పష్టతతో రాష్ట్రఅభిప్రాయాలు స్పష్టంచేయాలని వారికి సూచించారు.