తెలంగాణ

telangana

Underground cables‌: ఇలా చేస్తే ఎంత వర్షం వచ్చినా కరెంట్​ పోదు!

వర్షం వచ్చినా, మరే సమస్యలు వచ్చినా.. విద్యుత్ అంతరాయం కల్గకుండా ఉండకూడదనే ఉద్దేశంతో భూగర్భ కేబుల్స్(Underground cables‌) వేయాలనే యోచన ఉందన్నారు టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి. అందులో భాగంగానే ఆదిత్య స్కీంలో ప్రతిపాదనలు ఉన్నాయని.. రూ.10వేల కోట్ల వరకు నిధులు అందే అవకాశం ఉందని తెలిపారు.

By

Published : Jul 19, 2021, 7:31 AM IST

Published : Jul 19, 2021, 7:31 AM IST

underground-cables-as-a-permanent-solution-to-power-outages-in-hyderabad
పుడమి ఒడిలో విద్యుత్తు తీగలు..!

‘రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో వర్షాకాలంలో విద్యుత్తు అంతరాయాలకు శాశ్వత పరిష్కారంగా భూగర్భ కేబుల్స్‌(యూజీ) వేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. కేంద్రం త్వరలో ప్రవేశపెట్టే ఆదిత్య స్కీంలో రూ.10వేల కోట్ల వరకు గ్రాంట్ల రూపంలో అందుతుందని ఆశిస్తున్నాం. తొలుత జాతీయ రహదారి వెంబడి ఎల్బీనగర్‌ నుంచి మియాపూర్‌ మార్గంలో యూజీ కేబుల్స్‌ వేయాలనేది ఆలోచన. ఆ తర్వాత అవుటర్‌ లోపల ఉన్న ప్రధాన రహదారుల వరకు దీన్ని విస్తరించనున్నాం. ఫలితంగాఅంతరాయాలు తగ్గడమే కాదు నగరం అందంగా కనిపిస్తుంది’అని దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) సీఎండీ జి.రఘుమారెడ్డి అన్నారు. ప్రీపెయిడ్‌ మీటర్లను ఏర్పాటు చేసుకునే వారికి విద్యుత్తు ఛార్జీల్లో 5 శాతం వరకు రాయితీ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ‘ఈనాడు’ ముఖాముఖి విశేషాలివి..

  • ప్రశ్న: రూ.వేల కోట్లతో ఏడేళ్లలో నెట్‌వర్క్‌ను విస్తరించినా వానాకాలంలో అంతరాయాలు పెరిగాయి?నివారణకు ఏం చేయనున్నారు?

రఘుమారెడ్డి:ఏటా వర్షాకాలానికి ముందే తీగలకు ఉన్న పతంగులు, వాటి కర్రలు తొలగించడంతోపాటు చెట్ల కొమ్మలను కత్తిరిస్తుంటాం. ఈసారి కొవిడ్‌ కారణంగా మే నెలలో ఎక్కువ మంది ఇంటి నుంచి పని చేస్తుండటంతో వేసవిలో అంతరాయాలు ఉండద్దొని ప్రీమాన్‌సూన్‌ నిర్వహణ పనులు చేయలేదు. దీంతో వానాకాలం మొదలు కాగానే తీగలపై చెట్ల కొమ్మల కత్తిరింపు మొదలెట్టాం. ఇందుకు ఒక్కోరోజు రెండేసి గంటల చొప్పున పనులు చేపట్టడంతో అంతరాయాలు పెరిగాయి. నివారణకు ఏదైనా 11కేవీ ఫీడర్‌లో సమస్య తలెత్తితే అక్కడే సరఫరా ఆపేసి మిగతా అంతటా వెంటనే విద్యుత్తు ఇచ్చే ఆటోమెటిక్‌ వ్యవస్థ సెక్షనైజర్లను 156 ఫీడర్ల నుంచి 1100 ఫీడర్లకు విస్తరించబోతున్నాం. చెట్లు అధికంగా ఉండే కాలనీల్లో కవర్‌ కండక్టర్లను, ఏబీ కేబుల్స్‌ను వేయనున్నాం.

  • ఓవర్‌హెడ్‌ లైన్లతో సమస్యలు వస్తున్నాయి అంటున్నారు.. శాశ్వత పరిష్కారంగా భూగర్భ కేబుళ్లు వేసే ఆలోచన ఏమైనా ఉందా?

భూగర్భ కేబుళ్లతో వర్షాకాలంలో అంతరాయాలకు శాశ్వతంగా చెక్‌పెట్టే అవకాశం ఉన్నా భారీగా నిధులు కావాల్సి ఉంటుంది. ఓవర్‌హెడ్‌ లైన్లతో పోలిస్తే భూగర్భ కేబుల్‌ వేసేందుకు పదిరెట్లు ఖర్చు అధికంగా అవుతుంది. బంజారాహిల్స్‌ జూబ్లీహిల్స్‌, ఐటీ కారిడార్‌లో యూజీ కేబుల్స్‌ వేసేందుకు అంచనాలు రూపొందించగా రూ.12 వేల కోట్లు అవుతుందని తేలింది. కేంద్రం త్వరలో ఆదిత్య స్కీమ్‌ ప్రవేశపెట్టబోతుంది. గ్రాంట్‌ రూపంలో అందుతుందని యూజీకేబుల్స్‌ కోసం రూ.పది వేల కోట్ల వరకు ఇందులో ప్రతిపాదిస్తున్నాం. నిధులు మంజూరైతే ఈ మార్గంలో 33 కేవీ, 11 కేవీ, ఎల్‌టీ లైన్లన్నీ భూగర్భంలోకి మార్చేస్తాం. క్రమంగా అవుటర్‌ లోపల ఉన్న ప్రధాన రహదారులను యూజీ కేబుల్స్‌ చేయాలనే ఆలోచనలు ఉన్నాయి. దీంతో నగరం మరింత అందంగా కనిపిస్తుంది.

  • వినియోగదారులకు మెరుగైన సేవలకు కొత్తగా ఏం చేస్తున్నారు?

ఆన్‌లైన్‌ సేవలను మరింత విస్తృతం చేశాం. కొత్తగా వినియోగదారుడు తన మొబైల్‌ నుంచి మీటర్‌ రీడింగ్‌ తీసి బిల్లు చెల్లించే సౌలభ్యం కల్పించాం. ప్రస్తుతం 14 వేలకుపైగా ప్రీపెయిడ్‌ మీటర్లు ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేశాం. వీటి పనితీరు బాగుంది. ఆదిత్య స్కీమ్‌ వచ్చాక గృహ వినియోగదారులకు ప్రీపెయిడ్‌ మీటర్లను బిగించనున్నాం. వీటి ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి విద్యుత్తు ఛార్జీల్లో 5శాతం రాయితీ ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నాం. దీనిపై ఈఆర్‌సీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

  • పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్‌కు అనుగుణంగా సన్నద్ధత ఎలాఉంది?

రాష్ట్రం ఏర్పడే నాటికి హైదరాబాద్‌లో గరిష్ఠ విద్యుత్తు డిమాండ్‌ 2261 మెగావాట్లు ఉంటే ఈ ఏడాది 3391 మెగావాట్లకు పెరిగింది. 33కేవీ విద్యుత్తు ఉపకేంద్రాల సంఖ్యను నగరంలో 333 నుంచి 476కి పెంచాం. నగరంలో ఏదైనా ఉపకేంద్రంలో సమస్య తలెత్తినా సరఫరా ఆగకుండా ట్రాన్స్‌కో చేపట్టిన 400కేవీ, 220కేవీ గ్రిడ్‌ కాపాడుతోంది. రెవెన్యూపరంగా ఐటీ కీలకం కావడంతో అక్కడ నిరంతర విద్యుత్తు సరఫరాకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం.

  • చిన్న వాన పడినా కరెంట్‌ సమస్యలు తలెత్తుతున్నాయి వీటి నుంచి విముక్తి ఎప్పుడు?

అప్పటివరకు ఎండకు ఎండిన విద్యుత్తు కండక్టర్లలో ఇన్సులేటర్లు ప్రారంభ వర్షాలకు దెబ్బతింటుంటాయి. వీటిలో వెంట్రుక మందంలో ఏర్పడిన పగుళ్లతో వానాకాలంలో నీరు చేరి ట్రిప్పవుతుంటాయి. ఈ పగుళ్లను ముందే గుర్తించే అవకాశం లేకపోవడంతో మొదటి ఒకటి రెండు వానలకు అంతరాయాలు అధికంగా ఉంటాయి. ఆ తర్వాత సరఫరా వ్యవస్థ సర్దుకుంటుంది. చెట్లు, కొమ్మలు విరిగిపడినా సందర్భాల్లోనూ త్వరగా సరఫరా పునరుద్ధరణకు ప్రతి ఉపకేంద్రానికి రెండు మూడుచోట్ల నుంచి ఇన్‌కమింగ్‌ ఉండేలా చర్యలు చేపట్టాం.

ఇదీ చూడండి:Teachers: ఆరేళ్లుగా సమస్యల్లో ఉపాధ్యాయులు.. జీవోలు ఇచ్చిన వాటికీ మోక్షం లేదు

ABOUT THE AUTHOR

...view details