TSRTC Express Parcel Parcel Services: లాజిస్టిక్స్ రంగంలో విప్లవాత్మక మార్పుల వస్తున్న నేపథ్యంలో వినియోగదారులకు కార్గో సేవలు మరింత చేరువ చేయనున్నామని టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జన్నార్ అన్నారు. హైదరాబాద్ ఆర్టీసీ బస్ భవన్లో 'ఏఎం టూ పీఎం'(AM 2 PM) పేరిట ఎక్స్ప్రెస్ పార్శిల్ సర్వీసును ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో వినూత్న రీతిలో 2020 జూన్ 19వ తేదీన ప్రవేశపెట్టిన ఆర్టీసీ కార్గో సేవలు ద్వారా చక్కటి సత్ఫలితాలు లభిస్తున్న దృష్ట్యా.. తాజాగా మధ్యాహ్నం 12 గంటల లోపు పార్శిల్ బుక్ చేస్తే రాత్రి 9 గంటల్లోగా అది వినియోగదారులకు చేరే విధంగా ఈ సేవలు ప్రారంభించామని ఆయన తెలిపారు.
ఒక కిలో బరువు పార్శిల్, అదీ సింగిల్ ప్యాక్ మాత్రమే ఎక్స్ప్రెస్ పార్శిల్ ద్వారా వెళితే.. కేవలం 90 రూపాయలు మాత్రమే రుసుం వసూలు చేస్తారు. ఇప్పటికే 5 కిలోల బరువు పార్శిల్ కోసం డిమాండ్ వస్తున్న దృష్ట్యా.. త్వరలో ఆ సేవలు కూడా ప్రవేశపెడతామని, ఆ ధరలు వేరుగా ఉంటాయని తెలిపారు. తిరుపతి, విశాఖపట్నం, బెంగళూరు వంటి నగరాలకు కూడా ఈ సేవలు అందిస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా వినియోగదారుల సౌకర్యార్థ్యం.. ట్రాఫిక్, లాజిస్టిక్స్ సేవలు ప్రారంభించన తర్వాత లాంఛనంగా "AM 2 PM" ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. ఐటీ, సాంకేతిక పరిజ్ఞానం పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్న తరుణంలో భవిష్యత్తులో మరిన్ని వైవిధ్యమైన ప్రణాళికలు రూపొందించి అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఎండీ పేర్కొన్నారు.