తెలంగాణలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎమ్మెస్)ల అధ్యక్ష, ఉపాధ్యక్ష, డైరెక్టర్ పదవులకు అభ్యర్థులను తెరాస అధినేత, సీఎం కేసీఆర్ ఖరారు చేయనున్నారు. ఈ జాబితాపై ప్రగతిభవన్లో ఆదివారం కసరత్తు చేశారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు పాల్గొన్నారు.
రేపు నామినేషన్ల దాఖలు
రాష్ట్రవ్యాప్తంగా డీసీసీబీల్లో 20 మంది డైరెక్టర్లు, డీసీఎమ్మెస్లలో 10 మంది డైరెక్టర్ల పదవులకు రేపు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. ఆదివారంనాటి కసరత్తులో దాదాపు 5 ఉమ్మడి జిల్లాల్లో డైరెక్టర్ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేశారు. ఉమ్మడి నిజామాబాద్, మహబూబ్నగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో డైరెక్టర్ స్థానాలపై ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు సమావేశమై నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్, కేటీఆర్ సూచించారు.