తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ కేసులో ఎంపీ నామాకు ఈడీ షాక్​.. రూ.80.66 కోట్లు జప్తు - Attach the assets of the deed

Nama Nageswara Rao
Nama Nageswara Rao

By

Published : Oct 17, 2022, 2:52 PM IST

Updated : Oct 17, 2022, 9:59 PM IST

14:46 October 17

తెరాస ఎంపీ నామా నాగేశ్వరరావు ఆస్తులు జప్తు చేసిన ఈడీ

ED attached Nama Nageshwar Rao properties: భాజపా, తెరాస మధ్య రాజకీయ వేడి కొనసాగుతుండగానే.. తెరాస లోక్​సభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కంపెనీ ఆస్తులపై ఈడీ మరోసారి కొరఢా ఝుళిపించింది. నామా నాగేశ్వరరావుతో పాటు ఆయన కుటుంబసభ్యుల పేరిట ఉన్న రూ.80 కోట్ల 65 లక్షల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. గతేడాది నామా నాగేశ్వరరావు ఇంట్లో సోదాలు జరిపి.. రూ.34 లక్షల నగదును స్వాధీనం చేసుకుంది. నామా నాగేశ్వరరావుతో పాటు పలువురిని ప్రశ్నించి వాంగ్మూలాలను నమోదు చేసింది. నామా నాగేశ్వరరావు బంధువు శ్రీనివాసరావును గతంలో ఈడీ అరెస్టు చేసింది.

మధుకాన్ గ్రూపునకు చెందిన రాంచీ ఎక్స్​ప్రెస్ వేస్ లిమిటెడ్​పై గతంలో సీబీఐ నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. రాంచీ నుంచి జంషెడ్​పూర్ వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణ కాంట్రాక్టు 2011లో మధుకాన్​కు దక్కింది. ప్రాజెక్టు నిర్మాణం కోసం కమ్మ శ్రీనివాసరావు, నామా సీతయ్య, నామా పృథ్వీ డైరెక్టర్లుగా రాంచీ ఎక్స్​ప్రెస్ వేస్ ప్రైవేట్ లిమిటెడ్​ను ఏర్పాటు చేశారు. రహదారి నిర్మాణం కోసం వివిధ బ్యాంకుల నుంచి రాంచీ ఎక్స్​ప్రెస్ వేస్ పేరిట రూ.1,080 కోట్ల రుణాలు పొందినట్లు ఈడీ వెల్లడించింది. నామా నాగేశ్వరరావు మధుకాన్ ప్రమోటర్​గా రుణాలకు పూచీకత్తు ఉన్నారని దర్యాప్తు సంస్థ పేర్కొంది. అయితే రుణం సొమ్మును రహదారి నిర్మాణం కోసం కాకుండా ఇతర వ్యాపారాలు, చెల్లింపుల కోసం మళ్లించడంతో పాటు తిరిగి చెల్లించకుండా ఎగవేసినట్లు ఈడీ అభియోగం.

బోగస్ కాంట్రాక్టులు, బిల్లులు సృష్టించడంతో పాటు 6 డొల్ల కంపెనీల ద్వారా నగదు లావాదేవీలు జరిపినట్లు ఈడీ వెల్లడించింది. ఉషా ప్రాజెక్ట్స్, శ్రీ బీఆర్ విజన్స్, శ్రీ ధర్మసాస్త కన్​స్ట్రక్షన్స్, శ్రీ నాగేంద్ర కన్​స్ట్రక్షన్స్, రాగిణి ఇన్​ఫ్రాస్ట్రక్చర్, వరలక్ష్మీ కన్​స్ట్రక్షన్స్ అనే 6 డొల్ల కంపెనీలు నామా నాగేశ్వరరావు, నామా సీతయ్య ఆధీనంలోనే ఉన్నాయని ఈడీ పేర్కొంది. గత జులైలో హైదరాబాద్, పశ్చిమ బంగా, విశాఖపట్నం, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో రూ.73 కోట్ల 74 లక్షల విలువైన 105 స్థిరాస్తులను ఈడీ అటాచ్ చేసింది.

తాజాగా హైదరాబాద్, ఖమ్మం, ప్రకాశం జిల్లాల్లో రూ.67 కోట్ల 8 లక్షల విలువైన 28 భూములు, భవనాలతో పాటు మధుకాన్ ప్రాజెక్ట్స్, మధుకాన్ గ్రానైట్స్​లో నామా నాగేశ్వరరావుకు చెందిన రూ.13 కోట్ల 57 లక్షల విలవైన షేర్లను కూడా జప్తు చేసింది. నామా నాగేశ్వరరావుకు చెందిన జూబ్లీహిల్స్​లోని మధుకాన్ గ్రూప్ ప్రధాన కార్యాలయం, నివాసాన్ని కూడా అటాచ్ చేసినట్లు ఈడీ వెల్లడించింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ తెలిపింది.

ఇవీ చదవండి:

Last Updated : Oct 17, 2022, 9:59 PM IST

ABOUT THE AUTHOR

...view details