లోటస్ పాండ్లో వైతెపా(YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS SHARMILA) భర్త అనిల్ కుమార్ను తాను కలిసినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని మాజీ ఉపముఖ్యమంత్రి, తెరాస ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య(MLA RAJAIAH) స్పష్టం చేశారు. రెండేళ్ల క్రితం ఓ క్రైస్తవ సమావేశం సందర్భంగా అనిల్ కుమార్తో ఉన్న ఫోటోను దురుద్దేశపూరితంగా ప్రచారం చేశారని తెలిపారు. వ్యక్తిగతంగా కలిసిన సందర్భాలను రాజకీయాలకు అంటగట్టడం సరైంది కాదన్నారు. వైతెపా నుంచి తనను ఎవరూ ఆహ్వానించలేదని.. ఆ అవసరం, ఆలోచన కూడా ఉండదన్నారు.
జీవితాంతం తెరాసలోనే(TRS).. కేసీఆర్తోనే(CM KCR) ఉంటానని రాజయ్య స్పష్టం చేశారు. ఉపముఖ్యమంత్రి పదవి పదవి పోయినప్పటికీ ఏ మాత్రం అసంతృప్తి లేదన్నారు. వైఎస్సార్(YSR) రాజకీయంగా అవకాశం ఇచ్చినప్పటికీ.. రాష్ట్రస్థాయి ఎదుగుదలకు తోడ్పంది మాత్రం కేసీఆర్ అని పేర్కొన్నారు. దళితులకు మూడెకరాల భూమి, రెండు పడక గదుల ఇల్లు వంటి పథకాలు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వకపోవడం వల్లే దళిత బంధు రూపకల్పన చేశారన్నారు. ఉత్తరాదికి చెందిన బహుజన సమాజ్ పార్టీకి(BSP) తెలంగాణలో ఆదరణ ఉండదని రాజయ్య అన్నారు. బీఎస్పీ ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడైనా దళిత బంధు ఉందా? ఇంతకన్నా సామాజిక న్యాయం ఇంకేముంటుందని రాజయ్య ప్రశ్నించారు.