తెలంగాణ

telangana

BJP Deeksha: రేపు ఇందిరాపార్కు వద్ద భాజపా ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష

By

Published : Mar 16, 2022, 3:28 PM IST

BJP Deeksha at Indira Park: హైదరాబాద్​ ఇందిరాపార్కు వద్ద భాజపా రేపు.. ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేపట్టనుంది. భాజపా ఎమ్మెల్యేల సస్పెన్షన్​పై హైకోర్టు సూచనను స్పీకర్​ తిరస్కరించడాన్ని నిరసిస్తూ ఈ దీక్ష చేపడుతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ప్రకటన విడుదల చేశారు.

BJP Deeksha at Indira Park
భాజపా ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష

BJP Deeksha at Indira Park: రేపు హైదరాబాద్​లో ఇందిరాపార్కు వద్ద ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేపడుతున్నామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రకటించారు. రేపు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు దీక్ష జరగనుందని బండి సంజయ్​ తెలిపారు. భాజపా ఎమ్మెల్యేలను సభలోకి అనుమతించే అంశాన్ని పరీశీలించాలన్న హైకోర్టు సూచనను స్పీకర్‌ తిరస్కరించడాన్ని నిరసిస్తూ దీక్షకు దిగుతున్నామని ఆయన తెలిపారు.

పార్లమెంటరీ సాంప్రదాయాలను తుంగలో తొక్కుతోందనడానికి భాజపా ఎమ్మెల్యేల సస్పెన్షన్‌నే నిదర్శనమని బండి సంజయ్​ అన్నారు. హైకోర్టు నిర్ణయాన్ని స్పీకర్​ పెడచెవిన పెట్టడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని స్పీకర్ కాపాడాలని హితవు పలికారు. దీక్షలో ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు, ఎంపీలు సోయం బాపూరావు, ధర్మపురి అర్వింద్ పాల్గొంటారని వెల్లడించారు. భాజపా దీక్షకు అన్ని వర్గాలు మద్దతు ఇవ్వాలని కోరారు.

కేసీఆర్​ భయపడుతున్నారు

అనంతరం నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయం నుంచి ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్​ మాట్లాడారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఫలితాలు చూసి కేసీఆర్‌ భయపడుతున్నారని లక్ష్మణ్‌ విమర్శించారు. అసెంబ్లీలో ద్రవ్య వినిమియ బిల్లుపై మాట్లాడుతూ కేంద్రాన్ని విమర్శించడం ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. భాజపా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి వారి గురించే మాట్లాడారని ఎద్దేవా చేశారు.

అందుకే ఉద్యోగ ప్రకటనలు

కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టి తెరాస నాయకులు పబ్బం గడుపుతున్నారని లక్ష్మణ్​ విమర్శించారు. కంటోన్మెంట్‌లో కరెంటు, నీళ్లు కట్ చేస్తామని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించడం దారుణమని అభిప్రాయపడ్డారు. తెరాస నేతలకున్న దేశభక్తి ఇదేనా అని ప్రశ్నించారు. కశ్మీర్​, హైదరాబాద్​ సంస్థానాలను బలవంతంగా భారత్​లో కలిపారని ఎమ్మెల్సీ కవిత పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. యువత తిరగబడుతుందనే ఉద్యోగ ప్రకటనలు చేశారని దుయ్యబట్టారు.

"ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్​ కంటే కేసీఆర్​ ఎక్కువ భయపడ్డారు. తెరాస వైఖరి చూస్తుంటే.. కేంద్రాన్ని విమర్శించడానికే అసెంబ్లీని వేదికగా వాడుకున్నారు అనిపిస్తుంది. సమావేశాల్లో కాంగ్రెస్​ వైఖరి చూస్తుంటే.. తెరాస, కాంగ్రెస్​ రెండూ ఒకే గూటి పక్షుల్లా అనిపిస్తున్నాయి." -లక్ష్మణ్‌, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు

ఇదీ చదవండి:KTR Inaugurates LB Nagar Underpass : 'కేంద్రం నుంచి కిషన్‌రెడ్డి రూ.10వేల కోట్లు తీసుకురావాలి'

ABOUT THE AUTHOR

...view details