పెత్రమాస సందర్భంగా తెలంగాణ జనసమితి పార్టీ ఆధ్వర్యంలో గన్ పార్కులోని తెలంగాణ అమరవీరుల స్థూపం ముందు ఉద్యమకారులను స్మరించుకున్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అమరులైన వారి పేరిట పార్టీ అధ్యక్షుడు ఆచార్య కోదండరామ్ (Tjs Kodandaram) వేద పండితులకు బియ్యం ఇచ్చారు. ప్రతి సంవత్సరం కుటుంబ పెద్దలను గౌరవించడం మన సంప్రదాయమని... అందులో భాగంగా అమరవీరులకు బియ్యం ఇచ్చి స్మరించుకుంటామని ఆచార్య కోదండరామ్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని ఆత్మహత్యలు ఉండవని అంతా అనుకున్నారని... కానీ గడిచిన ఏడేళ్లలో 20 మంది నిరుద్యోగులు ఆత్మబలిదానం చేసుకున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఇటీవల శాసనసభలో లక్షా 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధాలు చెప్పారని... అదే నిజమైతే ఆ నోటిఫికేషన్ ఏమిటో బహిరంగ పరచాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తక్షణమే జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని ఇలాంటివి మళ్లీ మళ్లీ పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో తెలంగాణ సమాజం ఆగ్రహానికి గురికాక తప్పదని ఆచార్య కోదండరాం హెచ్చరించారు.