తెలంగాణ

telangana

వేలికొనలపైనే వెంకన్న సేవలు

By

Published : Nov 17, 2019, 10:16 AM IST

తిరుమల వడ్డీకాసులవాడి క్షేత్రంలో కాసుల గలగలలు తగ్గాయి. అలాగని శ్రీనివాసుడి సంపద తగ్గుతోందనుకుంటున్నారా..! అదేమీ లేదు. స్వామివారి బ్యాంకు ఖాతాలు కళకళలాడుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం వచ్చే ధార్మిక సంస్థగా పేరుగాంచిన తితిదే హుండీ కానుకలు, విరాళాలు, ఇతర సేవల రూపేణా నిత్యం సగటున రూ.7 నుంచి 8 కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నా.. ఈ మధ్య నగదు కనిపించడం లేదు. కారణం.. దేవస్థానం అందిపుచ్చుకున్న సాంకేతికత! ఇప్పుడు తితిదేలో చాలా లావాదేవీలు నగదురహితమే..!

వేలికొనలపైనే వెంకన్న సేవలు

తితిదే ఆర్థిక కార్యకలాపాలన్నీ నగదు రహితంగా చేపడుతూ.. కరెన్సీ నోటుకు స్వస్తి పలుకుతోంది. భక్తులు, వ్యాపారులతో జరిపే లావాదేవీల్లోనూ ఆన్‌లైన్‌ పద్ధతే అవలంబిస్తోంది. శ్రీవారి ఆర్జితసేవలు, బ్రేక్‌ దర్శనం, ప్రత్యేక దర్శనం, వసతి గదులకు భక్తులు రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించేలా అధికారులు ప్రోత్సహిస్తున్నారు.

ఈ సేవలను ముందస్తుగా బుక్‌ చేసుకునేలా తితిదే వెబ్‌సైట్‌ను ఆధునికీకరించడం సహా గోవింద యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని వల్ల 3 నెలల ముందే భక్తులు అంతర్జాలంలో సొమ్ము పంపుతున్నారు. ఆర్జితసేవల టిక్కెట్లను దేవస్థానం ప్రతినెలా మొదటి శుక్రవారం విడుదల చేస్తుంది. నాలుగు రోజుల పాటు బుకింగ్‌కు గడువిచ్చి.. తర్వాతి మంగళవారం లక్కీ డ్రా తీస్తుంది. ఎంపికైన భక్తులు వెంటనే ఆన్‌లైన్‌లో తితిదే ఖాతాకు డబ్బు బదిలీ చేసి.. టిక్కెట్‌ ఖరారు చేసుకోవాలి.

అంతటా స్వైపింగ్‌ యంత్రాలే

తితిదేకు చెందిన అన్ని కౌంటర్లలో స్వైపింగ్‌యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. తిరుమలలో 7 వేల అద్దె గదులుండగా వాటిలో సుమారు మూడోవంతు గదులను ముందస్తుగా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవచ్చు. మిగిలిన గదులను భక్తులకు కరెంట్‌ బుకింగ్‌ కింద అప్పటికప్పుడు ఇస్తారు.

  1. అద్దెగదుల కోసం పలుచోట్ల కౌంటర్లున్నాయి. 2019 జనవరి నుంచి అక్టోబరు వరకు లెక్కలు చూస్తే.. వీఐపీల సిఫార్సు లేఖలపై గదులు కేటాయించే శ్రీపద్మావతి విచారణ కేంద్రం వద్ద 97 శాతం, ఎంబీసీ వద్ద 100 శాతం నగదు రహిత లావాదేవీలు సాగినట్లు తేలింది.
  2. సాధారణ భక్తులకు గదులు కేటాయించే టీబీ కౌంటర్‌లో 91 శాతం, సప్తగిరి విశ్రాంతిగృహాల వద్ద 62 శాతం, సూరాపురంతోట, రాంభగీచా, సీఆర్వో జనరల్‌ కౌంటర్లలో 50 శాతం చెల్లింపులు నగదు రహితంగా జరిగాయి.
  3. తితిదే వెబ్‌సైట్‌, గోవింద యాప్‌లో ‘ఈ-హుండీ’ ఆప్షన్‌ అందుబాటులోకి వచ్చాక భక్తులు విరాళాలనూ ఆన్‌లైన్‌లోనే తితిదే ఖాతాల్లో జమ చేస్తున్నారు.
  4. తితిదే తన ఆధీనంలోని ట్రస్టులు, పథకాల నిర్వహణ కోసం దాతల ద్వారా సేకరించే విరాళాలను డీడీల రూపంలోనే స్వీకరిస్తుంది. సప్తగిరి మాసపత్రిక, డైరీలు, తితిదే ప్రచురణలను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయొచ్చు.
  5. భక్తులు ప్రధానాలయంలోని హుండీలో వేసే నగదు, నగలు మినహా.. అంతటా నోటుకు ‘నో’ చెబుతోంది.

వంద శాతానికి తీసుకెళ్తాం
తితిదే సేవలకు ఆన్‌లైన్‌ లావాదేవీలే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నాం. అద్దె గదుల కరెంట్‌ బుకింగ్‌, ఆర్జితసేవల లక్కీడిప్‌లలోనూ కార్డు స్వైపింగ్‌నే ప్రోత్సహిస్తున్నాం. తద్వారా నగదు చలామణిలో ఉన్న ఇబ్బందులు, అవకతవకలకు తావులేకుండా చూస్తున్నాం. హుండీ కానుకలు తప్ప ఎక్కడా నగదు వాడే అవకాశం దాదాపు లేదు. తిరుమలలోని వాణిజ్య సముదాయాల్లో దుకాణాల అద్దెనూ నగదురహితంగా తీసుకుంటున్నాం. భవిష్యత్తులో విద్యుత్తు, నీటిబిల్లుల చెల్లింపులకూ ఇదే విధానం అనుసరిస్తాం.
-ఏవీ ధర్మారెడ్డి, తితిదే అదనపు ఈవో, తిరుమల

తితిదేలో అమలు చేస్తోన్న ఆన్​లైన్​ విధానం వల్ల చాలా వరకూ సేవలు పారదర్శకంగా ఉంటున్నాయని భక్తులు చెబుతున్నారు. ఆన్​లైన్​ చెల్లింపుల వల్ల చోరీల భయం లేదని అంటున్నారు.

ఇదీ చదవండి:'అయోధ్య రామాలయానికి మోదీ శంకుస్థాపన చేయాలి!'

ABOUT THE AUTHOR

...view details