తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్డరిస్తే ఇంటికే మాంసం డెలివరీ.. ఈ-స్టార్టప్‌లకు పెరిగిన గిరాకీ

ఇంటికి అనుకోకుండా బంధువులొచ్చారు. వాళ్లకి సాదాసీదాగా వండిపెడితే ఏం బాగుంటుంది. పోనీ చికెనో మటనో వండేద్దామంటే మార్కెట్‌కెళ్లి తేవడానికి ఎవరన్నా ఉండాలి. లేదంటే కాయగూరలతో సరిపెట్టాల్సిందే. మరి అలాంటి సమస్యలకి చెక్‌పెడుతూ తాజా చికెన్‌, మటన్‌, సీ ఫుడ్‌ని శుచిగా ఇంటికే తెచ్చి ఇస్తున్నాయి కొన్ని స్టార్టప్‌లు. ఆదాయంలోనూ దూసుకుపోతూ... లక్షల మంది వినియోగదారులకు చేరువైన ఆ స్టార్టప్‌లు ఏవంటే...

By

Published : Jul 7, 2020, 9:42 AM IST

ఇంటికే మాంసం పంపిస్తాయి.. ఈ స్టార్టప్‌లు
ఇంటికే మాంసం పంపిస్తాయి.. ఈ స్టార్టప్‌లు

మనదేశంలో మాంసాహారానికి యమ గిరాకీ ఉంది. మామూలు రోజుల్లో ఎలా ఉన్నా... ఆదివారం మాత్రం ఆ దుకాణాల ముందు జనాలు బారులు తీరి కనిపిస్తారు. తమ వంతు కోసం ఎంతో సమయం ఎదురు చూసి మటనో, చికెనో ప్యాక్‌ చేయించుకుని వెళతారు. అలాగని సెలవునాడు పొద్దున్నే లేచి వెళ్లడం కూడా కష్టమే. ఆ సమస్యలన్నీ లేకుండా మాంసం ఇంటికే వస్తే బాగుంటుంది కదా అనుకున్నారు వివేక్‌ గుప్తా, అభయ్‌ హన్జురాలు.

అలా ఆలోచించిన ఆ ఇద్దరు స్నేహితులు ఉద్యోగాలు మానేసి 2015లో లిషియస్‌ అనే స్టార్టప్‌ను ప్రారంభించారు. బెంగళూరు, దిల్లీ, హైదరాబాద్‌, మొహాలీ, ముంబయి, పుణె, చెన్నై.. వంటి ఏడు ప్రాంతాల్లో 27 అవుట్‌లెట్లను ఏర్పాటు చేశారు. ఈ స్టార్టప్‌ ద్వారా వివేక్‌, అభయ్‌లు దాదాపు 180 చికెన్‌, మటన్‌ దుకాణాలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కోళ్లూ, మేకల ఫామ్‌ల నుంచి నేరుగా లైవ్‌ స్టాక్‌ తీసుకుని మాంసాన్ని అమ్ముతున్నారు. చేపల్ని కూడా జాలర్లూ, రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఆర్డరిచ్చిన రెండు గంటల లోపు డెలివరీ అందిస్తోన్న ఈ సంస్థ చేపలు, రొయ్యలు, చికెన్‌, మటన్‌, రెడీ టు కుక్‌, ఫ్రోజన్‌ ఫుడ్‌, గుడ్లను అందిస్తోంది. రోజుకు 17 వేల మందికిపైనే డెలివరీలు ఇచ్చే లిషియస్‌ లాక్‌డౌన్‌ సమయంలో 3 లక్షల ఆర్డర్లు అందించి మరింత ఆదాయం పొందడంతోపాటు విదేశీ పెట్టుబడుల్ని సైతం అందుకుంది.

సొంత ఫామ్‌ల నుంచే...

జాప్‌ ఫ్రెష్‌... గుడ్‌గావ్‌ కేంద్రంగా ప్రారంభమైన స్టార్టప్‌. మొబీక్విక్‌లో కలిసి పనిచేసిన దీపాన్షూ మన్‌చందా, శృతీ గోచ్‌వాల్‌ కలిసి దీన్ని ప్రారంభించారు. ఉదయం 8 నుంచి రాత్రి 10 వరకూ సేవలందించే ఈ సంస్థ ప్రస్తుతం గుడ్‌గావ్‌తోపాటు దిల్లీ, నోయిడా, గ్రేటర్‌ నోయిడా, ఘాజియాబాద్‌, జైపుర్‌, వంటి ఎనిమిది ప్రాంతాల్లో మాంసాహారాన్ని హోండెలివరీ ఇస్తోంది. చికెన్‌, మటన్‌, సీ ఫుడ్‌, పంది మాంసం, రెడీ టు కుక్‌ మాంసాహారాన్ని అందిస్తున్న జాప్‌ఫ్రెష్‌ దిల్లీ, ఘాజియాబాద్‌లలో స్వయంగా కోళ్లూ, మేకలూ, పందులతో ఫామ్‌ నడుపుతోంది. వాటికి యాంటీబయోటిక్స్‌, హార్మోన్ల వంటివి ఇవ్వకుండా ఆరోగ్యకరమైన వాతావరణంలో పెంచుతోంది.

కొన్ని ప్రాంతాల్లో నేరుగా రైతులకి పెట్టుబడి పెట్టి మరీ ఫామ్‌లను వారి చేత నడిపిస్తోంది. రైతుల దగ్గరున్న కోళ్లూ, మేకల్నీ, చేపల్నీ పరీక్షించి ఆరోగ్యంగా ఉన్నాయని రుజువైతేనే కొనుగోలు చేస్తారు. ఎంతో పక్కాగా నడిపిస్తున్న ఈ స్టార్టప్‌ను 2015లో 40 లక్షలతో ప్రారంభించిన దీపాన్షూ, శృతీలు తమ అవుట్‌లెట్లలో వినియోగదారులు ఆర్డరిచ్చిన 3 గంటల్లోపే హోం డెలివరీ చేస్తారు. ప్రస్తుతం 200 మందికి ఉపాధినిస్తున్న జాప్‌ఫ్రెష్‌ రోజుకు 15 వేల డెలివరీలు అందిస్తోంది. ఈ మధ్యనే డాబర్‌ ఇండియా ఈ సంస్థలో 20 కోట్లు పెట్టుబడి పెట్టింది.

మసాలా పట్టించి ఇస్తారు...

టెండర్‌ కట్‌ సంస్థని చెన్నైకి చెందిన నిశాంత్‌ చంద్రన్‌ 2016లో ప్రారంభించాడు. విదేశాల్లో ఉద్యోగం చేసి కొన్నాళ్లు యూరప్‌ చుట్టొచ్చాడు నిశాంత్‌. అక్కడ మాంసాహారం దుకాణాలు చాలా శుభ్రంగా, ఎలాంటి గందరగోళ పరిస్థితులు లేకుండా వినియోగదారులకు మాంసాన్ని అందించడం చూశాడు. కానీ మన దగ్గర అలాంటి పరిస్థితి లేదు. పైగా మగవాళ్లు ఇంట్లో లేనప్పుడు ఆడవాళ్లు మాంసం కోసం బయటకు వెళ్లడం చాలా తక్కువ. ఆ పరిస్థితుల్ని దగ్గరగా గమనించిన నిశాంత్‌ దాదాపు రెండేళ్లపాటు భారత్‌లో మీట్‌ మార్కెట్‌పై అధ్యయనం చేసి ‘టెండర్‌ కట్‌’ స్టార్టప్‌ను ప్రారంభించాడు.

దీని ద్వారా రోజూ చికెన్‌, మటన్‌, చేపలు, మాంసాహార పచ్చళ్లూ, మసాలా పొడుల్నీ, మ్యారినేట్‌ చేసిన చికెన్‌ మటన్‌లనూ అందిస్తున్నాడు నిశాంత్‌. చెన్నై, హైదరాబాద్‌లలో సేవలందిస్తోన్న ఈ సంస్థ ఫామ్‌లూ, మత్య్సకారుల నుంచి నేరుగా మాంసాన్ని కొనుగోలు చేస్తుంది. రైతులకు అప్పుడప్పుడూ వర్క్‌షాపులు నిర్వహిస్తూ ఈ ఫామ్‌ల నిర్వహణలో ఆధునిక పద్ధతుల్ని పరిచయం చేస్తోంది కూడా.

ఇదీ చదవండి:20-20-20 సీక్రెట్ గురించి మీకు తెలుసా?

ABOUT THE AUTHOR

...view details