‘తెరాస ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో సరైన ఆధారాలు లేవంటూ.. ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించేందుకు అవినీకి నిరోధక శాఖ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నిరాకరించారు. వారిని తక్షణమే విడుదల చేయాలని, 41 సీఆర్పీసీ కింద నోటీసులిచ్చిన తర్వాతే విచారించాలని స్పష్టం చేశారు. నిందితులు రామచంద్ర భారతి, సింహయాజి, నందకుమార్లను పోలీసులు రాత్రి సరూర్నగర్లోని న్యాయమూర్తి జీ. రాజగోపాల్ నివాసానికి తీసుకెళ్లి ఆయన ఎదుట హాజరుపరిచారు. లంచం సొమ్ము దొరకనందున ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం వర్తించదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
న్యాయమూర్తి ఆదేశాల నేపథ్యంలో నిందితుల్ని విడిచిపెట్టామని శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్రెడ్డి వెల్లడించారు. తెరాస ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారని ముగ్గురు నిందితులపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై రాత్రి వరకు ముమ్మరంగా దర్యాప్తు జరిగింది. నిందితులు కోట్ల నగదు తీసుకొచ్చారని ప్రచారం జరిగినా దానికి సంబంధించిన ఆధారాలను పోలీసులు వెల్లడించలేదు. కానీ జాతీయస్థాయిలో ఒక కీలక నాయకుడి కార్యదర్శి మాట్లాడిన ఆడియో టేపులు లభించాయని పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
తెరాసను వదిలిపెట్టి భాజాపాలో చేరితే ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డికి 100 కోట్లు, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజ్, హర్షవర్ధన్రెడ్డి, రేగా కాంతారావుకు ఒక్కొక్కరికి 50 కోట్ల రూపాయల చొప్పున ఇస్తామంటూ ప్రలోభపెట్టారని... రోహిత్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్లను అరెస్టు చేసి సుదీర్ఘంగా పోలీసులు విచారించారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో కాంట్రాక్టులు కట్టబెడతామని ఆశపెట్టినట్టు... లేకుంటే ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తామని హెచ్చరించినట్టు రోహిత్రెడ్డి ఫిర్యాదు చేశారు.