తెలంగాణ

telangana

రూ.2,000 కోట్ల రుణం తీసుకున్నా... చేతికి చిక్కలేదు.. ఎందుకంటే..

By

Published : Feb 9, 2022, 9:27 AM IST

కొత్త అప్పులు పొందేందుకు ఆంధ్రప్రదేశ్​ అనేక కష్టాలు పడుతోంది. మంగళవారం సెక్యూరిటీల వేలంలో ప్రభుత్వం పాల్గొని రూ.2వేల కోట్ల రుణం తీసుకున్నా.. అది చేతికి చిక్కలేదు. రుణ మొత్తం ఓడీ కింద ఆర్‌బీఐకే జమ చేయాల్సి చేయాల్సి వచ్చినట్లు తెలిసింది.

AP Debts
ఏపీ రాష్ట్రానికి దొరకని అప్పులు

చాలారోజుల తర్వాత సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఆంధ్రప్రదేశ్‌ తీసుకున్న అప్పు చేతికి చిక్కలేదు. రుణ మొత్తం ఓవర్‌ డ్రాఫ్టు(ఓడీ) కింద ఆర్‌బీఐకే జమ చేయాల్సి వచ్చినట్లు సమాచారం. కొత్త అప్పులు పొందేందుకు రాష్ట్రం ఇటీవల అనేక కష్టాలు పడుతోంది. ఏ రూపంలో రుణం తీసుకునేందుకు ప్రయత్నించినా అవాంతరాలు ఎదురవుతున్నాయి. విద్యుత్తు రంగ సంస్కరణలతో అదనంగా రూ.2,133 కోట్లను రుణంగా తీసుకునేందుకు కేంద్రం పది రోజుల కిందట అనుమతిచ్చింది. దాంతో రాష్ట్రం మంగళవారం సెక్యూరిటీల వేలంలో పాల్గొంది. రూ.1000 కోట్లను 16 ఏళ్ల కాలపరిమితితో 7.37% వడ్డీ చెల్లించేలా, మరో రూ.1000 కోట్లను ఇరవై ఏళ్ల కాలపరిమితికి అదే వడ్డీ రేటుతో రుణాలుగా తీసుకుంది. ఇప్పటికే ఆర్‌బీఐ వద్ద ఏపీ ఖజానా వసూళ్లకు మించి నిధులను వాడుకున్నందున తాజాగా తీసుకున్న అప్పు మొత్తం ఓడీకే సర్దుబాటు చేయాల్సి వచ్చినట్లు తెలిసింది.

మూడు విధాలుగా వెసులుబాటు

రాష్ట్ర రాబడికి మించి వ్యయం ఉన్నప్పుడు... ఖర్చులను వెళ్లదీయడానికి అప్పులు తీసుకునేందుకు రిజర్వుబ్యాంకు వివిధ రకాల అనుమతులు ఇస్తుంది. ఇందులో భాగంగా వేస్‌ అండ్‌ మీన్స్‌ రూపంలో నిధులను సమకూర్చుకోవచ్చు. ఆ పరిమితి దాటితే ప్రత్యేక డ్రాయింగు సదుపాయం వినియోగించుకుని మరిన్ని నిధులు తీసుకోవచ్చు. దీని పరిమితి కూడా దాటిపోయాక ఓవర్‌ డ్రాఫ్ట్‌ సదుపాయం ఉంటుంది. ఓడీ కోటాలో తీసుకున్న నిధులన్నీ సంబంధిత వడ్డీతో తిరిగి రిజర్వుబ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా ఒక రకమైన అప్పు లాంటిదే.

ఆరు వారాల్లో రూ.4,500 కోట్ల అప్పు

ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రుణాలు తీసుకునేందుకు రాష్ట్రానికి కష్టాలు ఎదురవుతున్నాయి. కేంద్రం నుంచి ఇంకా అనుమతులు రాకపోవడంతో ఆశించిన మేరకు సెక్యూరిటీల వేలంలో పాల్గొనడం సాధ్యమవడం లేదు. జనవరి తర్వాత ఇప్పటివరకు ప్రభుత్వం రెండు విడతలుగా రూ.4,500 కోట్ల రుణం తీసుకుంది. జనవరి 4న రూ.2,500 కోట్లను తీసుకున్నా మళ్లీ ఇన్నాళ్లపాటు ఆగాల్సి వచ్చింది. మూడో త్రైమాసికం కూడా పూర్తి కావడంతో మూలధన వ్యయం కింద నిర్దిష్ట మొత్తాలను రాష్ట్రం ఖర్చు చేసిందో లేదో లెక్కించి... ఆ మేరకు మినహాయించిన రుణ అనుమతులపై కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి:Wedding Invitation Video Viral : లవ్​స్టోరీ వీడియోతో ఐఏఎస్ పెళ్లి ఆహ్వానం..

ABOUT THE AUTHOR

...view details