తెలంగాణ

telangana

AP Government Loans : 'అప్పు'డే.. 2 వేల కోట్ల రుణం తీసుకుంటున్న ఏపీ!

By

Published : Jan 10, 2023, 9:20 AM IST

AP Government Loans : ఏపీ ప్రభుత్వ ఆర్థిక కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఆర్థిక నిర్వహణ సరిగా లేకపోవడం, పరిమితికి మించి అప్పులు చేయడంతో చివరి త్రైమాసికం సజావుగా గడవటం ప్రశ్నార్థకంగా మారింది. అడిగినన్ని రుణాలకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంతో.. ఆర్థిక నావను ఎలా ముందుకు తీసుకువెళ్తారనేది ఆర్థిక శాఖలోనే చర్చనీయాంశమైంది.

AP Government
AP Government

AP Government Loans : సాధారణంగా కేంద్రం ప్రతి ఏడాది జనవరిలో చివరి త్రైమాసికానికి సంబంధించిన కొత్త అప్పులకు అనుమతిస్తుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ 21వేల కోట్ల రూపాయలు కొత్త రుణం అవసరమని కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. కేంద్రం 4 వేల 557 కోట్లకే అనుమతినిచ్చింది. అందులో 2 వేల కోట్ల రూపాయలను ఏపీ నేడు తీసుకోబోతోంది. ఇక మిగిలే రుణ పరిమితి 2 వేల 457 కోట్లే. కేంద్రం నుంచి ఇంత తక్కువ మొత్తానికే అనుమతి వస్తుందని ఊహించని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఆర్థిక బండిని ముందుకు నడపాలంటే అప్పులు చేయక తప్పని పరిస్థితిలో జగన్‌ ప్రభుత్వం ఉంది.

వివిధ కార్పొరేషన్ల నుంచి రాష్ట్రం తీసుకున్న అప్పులపై కాగ్‌ అధికారులు ప్రత్యేకంగా ఆడిట్‌ చేయిస్తున్నారు. బెవరేజస్‌ కార్పొరేషన్‌ నుంచి 8 వేల300 కోట్లు ఈ ఏడాది తీసుకున్నారు. ఇలాగే ఇతర కార్పొరేషన్ల నుంచీ తీసుకున్నారు. అవి ఎంత మొత్తంలో ఉన్నాయో ప్రభుత్వం పారదర్శకంగా వెల్లడించడం లేదు. కాగ్‌ అధికారులు అడిగినా వివరాలను అందించడం లేదు. దీంతో ఆడిట్‌ విభాగం ప్రత్యేకంగా తనిఖీ చేస్తోంది. కార్పొరేషన్ల అప్పులపై నోట్‌ ఫైల్‌ ఇవ్వాలని కోరినా ఆర్థికశాఖ స్పందించడం లేదని తెలుస్తోంది. దీంతో రుణాలిచ్చిన బ్యాంకుల నుంచే సమాచారం రాబట్టాలని ఆడిట్‌ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details