ప్రస్తుతం రెవెన్యూ వ్యవస్థకు క్షేత్రస్థాయిలో నేరుగా ప్రజలతో సంబంధాలు కొనసాగిస్తున్నది వీఆర్వోలే. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను వీరే పరిశీలించి ఉన్నతస్థాయికి పంపిస్తున్నారు. గ్రామాల్లో షాదీముబారక్, కల్యాణలక్ష్మి, పింఛన్లు, భూ సంబంధిత పత్రాల పరిశీలన వారి చేతుల మీదుగానే నడుస్తోంది. కొందరు అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. తాజాగా వీఆర్వోల వ్యవస్థ రద్దుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ మూడు జిల్లాల్లో పనిచేస్తున్న వీర్వోలందరూ తమ వద్ద పెండింగులో ఉన్న దస్త్రాలు తహసీల్దార్లకు సోమవారం సాయంత్రానికల్లా స్వాధీనపరిచారు. పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆర్ఓఆర్ దరఖాస్తులతోపాటు పహాణీలు, 1బీ రిజిస్టర్లునూ అందజేశారు. పెండింగు అర్జీల భారం రెవెన్యూ ఇన్స్పెక్టర్ల(ఆర్ఐల)పై పడనుంది. ప్రభుత్వ నిర్ణయంతో మండలాల్లో రెవెన్యూ సిబ్బంది చాలావరకు తగ్గిపోనున్నారు. మొయినాబాద్ మండలంలో రెవెన్యూ శాఖలో 18 మంది ఉండగా, వీఆర్వోలు తగ్గిపోతే తహసీల్దారుతో కలిపి నలుగురే మిగులుతారు. ఇద్దరు ఆర్ఐలకు ఒక్కరే ఉండగా సర్వేయర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. శంషాబాద్ మండలంలో తహసీల్దారు సహా ఐదుగురు మిగిలారు.
ఆ బాధ్యతలు ఎవరికి..?
మూడు జిల్లాల్లో భూములకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇప్పటికే ప్రభుత్వ భూముల పరిరక్షణ కత్తి మీద సాముగా మారింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో నిత్యం ఏదో ఒక చోట ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతోందన్న ఆరోపణలున్నాయి. చెరువుల రక్షణ పెద్ద సవాల్గా పరిణమించింది. గ్రేటర్లో 160 వరకు చెరువులున్నాయి. రెవెన్యూ సిబ్బంది పర్యవేక్షణ కొరవడి చాలావాటిపై ఆక్రమణదారుల కన్నుపడిందన్న విమర్శలున్నాయి. కబ్జాలు వెలుగు చూసినప్పుడు నియంత్రించే బాధ్యత వీఆర్వోలే చూస్తున్నారు. ఇకపై ఆ బాధ్యతలు ఎవరు నిర్వర్తిస్తారనేది కీలకంగా మారింది.