తెలంగాణ

telangana

ఈఎస్​ఐ ఔషధ కొనుగోళ్లలో రూ.10 కోట్ల గోల్​మాల్

By

Published : Sep 27, 2019, 4:56 AM IST

Updated : Sep 27, 2019, 5:25 AM IST

రాష్ట్ర కార్మిక బీమా వైద్య సేవల సంస్థ (ఈఎస్‌ఐ)లో ఔషధాల కొనుగోళ్ల గోల్‌మాల్‌ వ్యవహారం కేసులో అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు వేగవంతం చేసింది. ఆ సంస్థ ఉన్నతాధికారుల నివాసాల్లో ఏసీబీ అధికార బృందాలు సోదాలు నిర్వహించాయి. పది కోట్లకు పైగా అవినీతికి పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు లభ్యమైనందున అనిశా అధికారులు ప్రత్యక్ష కార్యచరణకు దిగారు.  నిందితుల అరెస్టుకు అనిశా అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.

ఈఎస్​ఐ ఔషధ కొనుగోళ్లలో రూ.10 కోట్ల గోల్​మాల్

ఈఎస్​ఐ ఔషధ కొనుగోళ్లలో రూ.10 కోట్ల గోల్​మాల్

ఈఎస్‌ఐలో మందుల కొనుగోళ్ల కుంభకోణం కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. కొనుగోళ్లకు సంబంధించి పదికోట్ల రూపాయలకు పైగా అవినీతి జరిగినట్లు తేలడంతో అనిశా అధికారులు 23 చోట్ల ఏకకాలంలో సోదాలు చేశారు. షేక్‌పేట్‌లో నివసించే సంస్థ సంచాలకురాలు దేవికారాణి, సంయుక్త సంచాలకురాలు పద్మ, సహాయ సంచాకురాలు వసంత ఇందిర సహా 14 మంది ఉద్యోగులు, నలుగురు ప్రైవేట్‌ వ్యక్తుల నివాసాల్లో సోదాలు నిర్వహించారు.

తప్పుడు బిల్లులు.. అనవసర కొనుగోళ్లు

మందుల కొనుగోళ్లలో ఈఎస్‌ఐ అధికారులు చేతి వాటం చూపినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. తప్పుడు బిల్లులు సృష్టించడం, అవసరం లేకపోయినా కొనుగోలు చేసి... బినామీల ద్వారా ఈ వ్యవహారం నడిపించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈఎస్‌ఐ సరఫరా చేసే మందులపై సంస్థ ముద్ర ఉంటుంది. ఉద్దేశపూర్వకంగానే అధికారులు ఇలాంటి ముద్ర లేని మందులు కొనుగోలు చేశారు. అనంతరం వాటిని బహిరంగ మార్కెట్‌లో విక్రయించారు. సోదాల్లో ఈ తరహా మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

రూ.కోటి 3 లక్షల గోల్​మాల్

పటాన్‌చెరు, బోరబండ ఆస్పత్రులకు చెందిన వైద్యుల పేరు మీద సంయుక్త సంచాలకురాలు పద్మ 2018 మే 26,28 తేదీల్లో కోటి 3 లక్షల 12వేల 247 రూపాయల వ్యయంతో మందుల కొనుగోలు కోసం రెండు బోగస్‌ ఇండెంట్లు తయారు చేశారు. అవి పరిశీలించకుండా ఈఎస్‌ఐ సంచాలకురాలు దేవికారాణి ఆ ఇండెంట్లను ఆమోదించారు. బొల్లారం, బొంతుపల్లి ఆస్పత్రుల కోసం కొనుగోలు చేసిన కోటి 25లక్షల 51 వేల 291 రూపాయల విలువైన మందులను ఆ ఆస్పత్రులకు సరఫరా చేయలేదు.

రూ.9 కోట్ల నష్టం

సంచాలకులు దేవికారాణి, సహ సంచాలకులు వసంత ఇందిర 2017, 2018లో రేట్​ కాంట్రాక్ట్​ ప్రకారం కాకుండా ప్రత్యేక డ్రగ్​ డిస్పెన్సింగ్​ యూనిట్ల ద్వారా స్థానికంగానే మందులు కొనుగోలు చేసి ప్రభుత్వానికి 9 కోట్ల 43 లక్షల 47 వేల 947 రూపాయల నష్టం చేకూర్చారు. ఆగస్టులో 286 కొనుగోలు ఆదేశాలు జారీ చేసి, అవి మూడు నెలల ముందే అంటే మే నెలలోనే జారీ చేసినట్లు చూపించారు. వీటికోసం 26 పాత బిల్లులను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త కొనుగోలు ఆదేశాలు సర్దుబాటు చేశారు.

ఈఎస్‌ఐ సంచాలకురాలు దేవికారాణి, సంయుక్త సంచాలకురాలు పద్మ, సహాయ సంచాలకురాలు ఇందిర వసంత, ఫార్మాసిస్టులు రాధిక, జ్యోత్స్న, విశ్రాంత ఫార్మాసిస్టు తబిత, ఫాతిమా, లావణ్య, నాగలక్ష్మి, సీనియర్‌ అసిస్టెంట్లు సురేంద్రబాబు, హర్షవర్దన్‌, పావని, కార్యాలయ సూపరింటెండెంట్లు సత్యనారాయణ, సురేశ్‌ అగర్వాల్‌, శ్రీనివాసరావు, వీరన్న, రికార్డు అసిస్టెంట్‌ రాజశేఖర్‌ నివాసాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ప్రైవేట్‌ వ్యక్తులు ఓమ్నీ మెడీ సంస్థకు చెందిన శివనాగరాజు, తేజ ఫార్మా ఏజెంట్‌ సుధాకర్‌రెడ్డి, ఓమ్మి ఎండి శ్రీహరి, ఓ తెలుగు ఛానల్‌ విలేకరి నరేంద్ర, సురేందర్‌రెడ్డి ఇళ్లలోనూ అనిశా సోదాలు కొనసాగాయి.

అరెస్టుకు రంగం సిద్ధం

ఈఎస్​ఐ అధికారులు పెద్ద ఎత్తున అక్రమాస్తులు కలిగిఉన్నట్లు అనిశా సోదాల్లో తేలింది. కొందరి నివాసాల్లో నగదుతో పాటు భారీగా బంగారం పట్టుబడింది. ఈఎస్​ఐ అధికారుల అరెస్టుకు ఏసీబీ రంగం సిద్ధం చేస్తోంది.

Last Updated : Sep 27, 2019, 5:25 AM IST

ABOUT THE AUTHOR

...view details